కార్వాన్, సెప్టెంబర్ 27: కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ కథనం ప్రకారం.. తాళ్లగడ్డ తాలీం అమ్లాపూర్ బస్తీలో నివపించే అలీ హుస్సేన్ఖాన్(65) రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తుంటాడు. ఇతడికి ముగ్గురు కొడుకులు, కూతురు. పెద్ద కొడుకు అమ్జద్ అలీఖాన్ (35)కు తండ్రితో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం ఏర్పడింది. ఆదివారం రాత్రి కొడుకులు గొడవపడుతుంటే.. అలీ హుస్సేన్ ఖాన్ వారికి నచ్చజెప్పడంతో సద్దుమణిగింది. అయితే తండ్రిపై ద్వేషంతో ఉన్న పెద్ద కుమారుడు అమ్జజ్ ఈ గొడవను సాకుగా తీసుకొని సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో తండ్రి అలీ హుస్సేన్ ఖాన్పై రాడ్డుతో దాడి చేసి కాళ్లు, తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఏం తెలియనట్లు అమ్జద్ తన తండ్రి కాలు జారి బాత్రూంలో పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు బావ మక్బూల్కు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి రెండో కుమారుడిని ప్రశ్నించగా, తన అన్న దాడి చేసినట్లు చెప్పాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.