Drugs | సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ముంబై తరహాలో హైదరాబాద్లో కూడా వీకెండ్లో గర్ల్ ఫ్రెండ్స్ సహాయంతో డ్రగ్స్ దందాను చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా నిఘాను పటిష్టం చేశారు. సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అతిపెద్ద సెక్స్ రాకెట్ గుట్టును బట్టబయలు చేశారు. ఇందులో పట్టుబడ్డ ప్రధాన నిందితుల్లో డ్రగ్ పెడ్లర్స్ ఉండటం, వివిధ దేశాలకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తూ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే రాకెట్ బయటపడింది. ఇక్కడా ముంబై తరహా యువతులను ఎరగా వేసి.. డ్రగ్స్ను విక్రయించే ముఠాలు తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు ఇలాంటి వాటిపై నిఘాను పెంచారు.
డ్రగ్స్ దందా.!
ట్రై పోలీస్ కమిషనరేట్లలో పబ్బులు కొనసాగుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే పబ్బులలో యువత కేరింతలు కొడుతున్నారు. ఇలాంటి చోట్లను డ్రగ్స్ ముఠాలు ఆసరాగా చేసుకుంటున్నాయి. కొన్ని పబ్బుల నిర్వాహకులు యువతులకు డబ్బులిచ్చి మరీ పబ్బుల్లో యువతను రెచ్చగొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో బయటపడ్డాయి. డ్రగ్స్ ముఠాలు కూడా యువతులను పబ్బుల్లోకి పంపుతున్నారు. సాధారణ యువత మాదిరిగానే వాళ్లు కూడా తాగి తందనాలు ఆడుతూ యువతను రెచ్చగొడుతుంటారు. వారికి ఆకర్షితులయ్యే వారిని మత్తులోకి దింపుతారు. వారికి కూడా డ్రగ్స్ అలవాటు చేస్తారు.
ఆ తరువాత యువకుడి సర్కిల్ మొత్తాన్ని నెమ్మదిగా ఆ రింగ్లోకి దింపుతారు. ఇలా రెండు మూడు వారాలు అదే పబ్బును ఎంచుకుంటూ యువతను మగువతో పాటు మాదక ద్రవ్యాల వైపు మళ్లిస్తున్నారు. ఇక్కడ నేరుగా డ్రగ్ పెడ్లర్స్ బయటకురారు. అమ్మాయిలే యువతను ఆకర్షిస్తున్నారు. మత్తుకు ఆకర్షితులైన యువతకు డ్రగ్ పెడ్లర్స్ నేరుగా డ్రగ్స్ విక్రయిస్తుంటారు. ఇలాంటి దందాలు ముంబైలో జరుగుతుంటాయి. డ్రగ్స్ దందాలో ఆరితేరిన స్మగ్లర్లు ఈ విధానాన్ని ఇతర పట్టణాలలో కూడా అమలు చేస్తున్నారు. గత ఏడాది చివరిలో సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయిన ఆర్ణవ్, సమీర్ ముంబైలోని గుడ్డూ సోఫిన్ పటేల్ అలియాస్ అబ్డాన్ ద్వారా డగ్స్ కొనుగోలుచేసి యువతులకు అందించినట్లు తేలింది. ఈ తరహా డ్రగ్స్ దందా జరిగేందుకు అవకాశాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హెచ్న్యూ ఫోకస్.!
హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గోవా నుంచి డ్రగ్స్ సరఫరాను మహానగరానికి రాకుండా కట్టడి చేసి విజయం సాధించారు. ఆ తరువాత ముంబైపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో డ్రగ్స్ స్మగ్లింగ్లో ఉండే ఎంఓ(మోడస్ ఆపరెండి)లను స్టడీ చేశారు. హైదరాబాద్ పోలీసులు ముంబై డ్రగ్స్ స్మగ్లర్లపై దాడులు చేసే అవకాశం ఉండటంతో, ముంబై నుంచి స్మగ్లర్లు బెంగళూర్కు తమ రూట్ను మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి తక్కువ మొత్తంలో హైదరాబాద్కు డ్రగ్స్ను తీసుకువచ్చేందుకు స్మగర్లు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులకు కొంత సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే బెంగళూర్లోని డ్రగ్స్ దందాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఇదిలాఉండగా.. ముంబై తరహా జరిగే వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ పార్టీలలో డ్రగ్ సరఫరాకు అవకాశం ఉండటంతో హెచ్న్యూ ఫోకస్ పెట్టింది.