హైదరాబాద్ : కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన పేట్లబుర్జు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి రూ. కోటి కేటాయించారు. తాను జన్మించిన హాస్పిటల్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం అని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఎంపీ సంతోష్ నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిని కలుగజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ముందుకు రావడానికి దోహద పడుతుందన్నారు. ఈ నిధులతో పేట్లబుర్జు హాస్పిటల్ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంపీ సంతోష్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్స్లో జన్మించిన వారు, ఆయా ఆసుపత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. పేట్లబుర్జు ఆస్పత్రి అవసరాలు, సౌకర్యాలు తీర్చేలా నిధులు వినియోగించాలని సూపరింటెండెంట్ను మంత్రి హరీశ్రావు ఆదేశించారు.