TS TET | ముషీరాబాద్, మార్చి 8: డీఎస్సీతో పాటు టెట్ వేసి, టీచర్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించడం అనవాయితీ అని, పక్క రాష్ర్టాలలో టెట్ వేసి విషయం ప్రభుత్వం గమనించి వెంటనే చర్యలు చేపట్టాని డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా కృష్ణయ్య పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్ పోస్టు రాయడానికి అర్హత లేదని, నిరుద్యోగల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెట్ నిర్వహించాలని కోరారు. నిరుద్యోగుల వయో పరిమితిని రెండేండ్లు పెంచడంతో ఎంతో మంది నిరుద్యోగుల జీవితాల్లో ఆశలు చిగురించాయన్నారు. అలాంటి వారికి డీఎస్సీ రాసుకునే అర్హత కల్పించకపోవడం, వయో పరిమితి పెంచి ఉపయోగం ఏంటని? ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ను ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. టెట్ నిర్వహించి ఆరు నెలలు అవుతుందని, అందులో పది శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఈ నేపథ్యంలో మరోమారు టెట్ నిర్వహించాలని కోరారు.
డీఎస్సీ పరీక్ష నిర్వహణకు టెట్ నిర్వహణకు మధ్య మూడు నెలల వ్యవధి ఉన్నదన్నారు. గతంలో పోస్టులు తక్కువగా ఉండటం, సిలబస్ మారడం వల్ల చాలా మంది అర్హత సాధించలేకపోయారని అన్నారు. బీఈడీ, డీఈడీ పాసైన నిరుద్యోగులు టెట్ వేయకపోవడంతో తీవ్ర సంతృప్తితో ఉన్నారని, ఒక అవకాశం కోల్పోతామనే ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 24 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉంటే కేవలం 11 వేల పోస్టులు భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. 24 వేల టీచర్ పోస్టుల భర్తీకి, టెట్ వేసి డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్తో 11న ఇందిరా పార్కు వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.