నగరంలో ప్రయాణం నరకాన్ని తలపించింది. కొన్ని గంటల వ్యవధిలోనే నగర రహదారులన్నీ ట్రాఫిక్ జామ్లతో అట్టుడికిపోయాయి. నిమిషాల వ్యవధిలో చేరాల్సిన గమ్యానికి వాహనదారులు గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాశారు. ఇంధన ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ బంక్లు బుధవారం నుంచి బంద్ కానున్నాయనే సమాచారం ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో వాహనదారులు పెద్ద ఎత్తున బంక్ల వైపు పోటెత్తారు. వాహనాల క్యూలైన్లు రహదారుల మీదకు సాగిపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. చర్లపల్లిలోని ఆయిల్ డిపోల నుంచి మంగళవారం ఉదయం నిలిచిపోయిన ట్యాంకర్ల సరఫరా మధ్యాహ్నం 3 తర్వాత పునరుద్ధరణ అయినప్పటికీ నిర్ణీత కాలంలో చమురు బంకులకు చేరలేదు. మంగళవారం రాత్రి వరకు గ్రేటర్వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యతో జనం అల్లాడిపోయారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఆలస్యంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి చేజారిపోయింది. రాత్రి వరకు అన్ని బంకులు మూసివేసి ఉన్నాయి.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నరకాన్ని తలపించింది. కొన్ని గంటల వ్యవధిలోనే నగర వ్యాప్తంగా రహదారులన్నీ ట్రాఫిక్ జాంలతో అట్టుడికిపోయాయి. అప్పటివరకు సాఫీగా సాగుతున్న నగర ప్రయాణం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా నరకాన్ని తలపించింది. ఇంధన ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ బంక్లు బుధవారం నుంచి బంద్ కానున్నాయనే సమాచారం ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో వాహనదారులు పెద్ద ఎత్తున బంక్ల వైపు పరుగులు తీశారు. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లో వాహనాలు కిక్కిరిసిపోవడంతో పాటు ఆ క్యూ లైన్లు రహదారుల మీద కూడా సాగిపోవడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 450కి పైగా ఉన్న బంక్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రధాన నగరంతో పాటు నలుమూలలా ట్రాఫిక్ జంఝాటం వాహనదారులకు చుక్కలు చూపించింది.
చర్లపల్లిలోని ఆయిల్ డిపోల నుంచి మంగళవారం ఉదయం నిలిచిపోయిన ట్యాంకర్ల సరఫరా మధ్యాహ్నం మూడు తర్వాత పునరుద్ధరణ అయినప్పటికీ ట్రాఫిక్ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మంగళవారం రాత్రి వరకు గ్రేటర్ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యతో జనం అల్లాడిపోయారు. నిమిషాల వ్యవధిలో చేరాల్సిన గమ్యానికి గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాశారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఆలస్యంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి చేజారిపోయింది. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠినమైన నిబంధనలతో చట్టాన్ని తీసుకురానుండటాన్ని దేశవ్యాప్తంగా డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ (పాక్షికంగా) ఉమ్మడి జిల్లాలకు పెట్రోలు, డీజిల్, శంషాబాద్ విమానాశ్రయానికి వైట్ పెట్రోల్ను సరఫరా చేసే చర్లపల్లి డిపోల వద్ద కూడా ఇంధన ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.
సోమవారం నుంచే పాక్షికంగా ట్యాంకర్లను నిలిపివేయగా.. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పూర్తిస్థాయిలో ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ఇన్ని జిల్లాల పరిధుల్లోని పెట్రోల్ బంక్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. అయితే మంగళవారం మధ్యాహ్నం బంకుల్లో పెట్రోల్ నిల్వలు తగ్గుతుండటంతో బుధవారం బంకులన్నీ బంద్ అవుతున్నాయనే సమాచారం ఒక్కసారిగా బయటికి వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ వాహనదారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలోని బంకుల వద్దకు పరుగులు తీశారు. ఇలా ప్రతి ఒక్క బంక్ వద్ద వందలాది వాహనాలు క్యూ కట్టడంతో నగరంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయింది. కొంతమేర పెట్రోలు, డీజిల్ ఉన్న వాహనాలు సైతం రెండు రోజుల పాటు పరిస్థితి ఎలా ఉంటుందోనని గంటల తరబడి బంక్ల వద్దనే పడిగాపులు కాశారు. శంషాబాద్ విమానాశ్రయంలో పది రోజులకు సరిపడా వైట్ పెట్రోల్ నిల్వలు ఉంటున్నందున వెంటనే ఈ ప్రభావం విమానయానంపై పడలేదు.
ఒకవైపు పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో? లేదో? అంటూ గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్న వాహనదారులకు బంక్లలోనూ ఇతర కష్టాలు ఎదురయ్యాయి. ఒక్కసారిగా వేలాది వాహనాలు రావడంతో బంక్ నిర్వాహకులు కేవలం నగదు మాత్రమే అనుమతించారు. డెబిట్ కార్డులు, గూగుల్, ఫోన్పేలతో చెల్లింపులు ఆలస్యం కావడం, వాటిని ధ్రువీకరించుకోవడానికి సమయం పడుతుండటంతో కేవలం నగదు ఉన్న వారికి మాత్రమే ఇంధనం పోస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో అకస్మాత్తుగా బంక్లలోకి వచ్చిన వాహనదారులు చాలామంది నగదు లేక, గంటల తరబడి క్యూ లైన్లలో ఉండి వెనక్కి తిరిగిపోలేక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
చర్లపల్లిలోని ఐవోసీఎల్, బీపీసీఎల్ డిపోల నుంచి పలు ప్రాంతాలకు డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతుంది. ఐవోసీఎల్ డిపోల నుంచి రోజుకు 300-350 వరకు, బీపీసీఎల్ నుంచి రోజుకు 400-450 ట్యాంకర్ల వరకు వెళ్తాయి. ట్యాంకర్లు కొన్ని 12వేల లీటర్లు, 20వేల లీటర్లు, 25వేల లీటర్ల సామర్థ్యంతో ఉంటాయి. అయితే మంగళవారం ఉదయం డిపోల నుంచి ఒక్క ట్యాంకర్ కూడా బయటకు వెళ్లలేదు. మధ్యాహ్నం తర్వాత నగరంతో పాటు జిల్లాల్లోనూ పరిస్థితి అతలాకుతలం కావడంతో ఇంధన కంపెనీల ప్రతినిధులు రంగంలోకి దిగారు. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నందున సమ్మె విరమించాలని డ్రైవర్లను కోరారు. డ్రైవర్ల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని నచ్చచెప్పడంతో ఎట్టకేలకు ట్యాంకర్ డ్రైవర్లు పట్టువీడారు. మధ్యాహ్నం మూడు తర్వాత డిపోల నుంచి ట్యాంకర్లు బయటికి కదిలాయి. అయినప్పటికీ పెట్రోల్ బంక్ల వద్ద మాత్రం క్యూ లైన్లు తగ్గలేదు.
ప్రతి పెట్రోల్ బంక్ వద్ద వందలాది వాహనాలు క్యూ కట్టడంతో పాటు అవన్నీ రహదారులపైనా బారులు తీరాయి. దీంతో ఒక్కసారిగా అది ట్రాఫిక్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గ్రేటర్వ్యాప్తంగా ప్రతిచోటా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం దర్శనమిచ్చింది. సాధారణంగా వెళ్లే వాహనాలు కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. ఇలా నిమిషాల వ్యవధిలో గమ్యాన్ని చేరాల్సిన వాళ్లు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సి వచ్చింది. పెట్రోల్ బంక్ల వద్ద క్యూ లైన్లు రాత్రి వరకు కొనసాగడంతో మధ్యాహ్నం నుంచి గంట గంటకూ ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారిపోయింది. సాయంత్రం కార్యాలయాలు, విద్యా సంస్థల నుంచి వాహనదారులు బయటికి రావడంతో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. వాస్తవానికి గత కొంతకాలంగా నగరంలో ట్రాఫిక్ సమస్య అనేది నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంధన కష్టాలు తోడవడంతో అది వాహనదారులకు చుక్కలు చూపించింది. కార్యాలయాలు, విద్యా సంస్థల నుంచి ఇంటికి వెళ్లే వారు కూడా బుధవారం పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానంతో మధ్యలోని పెట్రోల్ బంక్ల వద్ద క్యూ కట్టారు.
ప్రజలు పెద్ద ఎత్తున ఇంధన అవస్థలు పడటంతో ట్యాంకర్స్ అసోసియేషన్ స్పందించింది. బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిద్దామని పెట్రోల్-డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి పిలుపునివ్వడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి ట్యాంకర్లు బయటికి కదిలాయి. ‘కేంద్రం తీసుకువచ్చిన మోటారు వాహనాల చట్ట సవరణ చిల్లుతో డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ ట్యాంకర్స్ నిలిపివేసి, ఆకస్మిక సమ్మెలోకి వెళ్లారు. డ్రైవర్లు ట్యాంకర్లు నిలిపివేయడంతో గందరగోళం ఏర్పడింది. కేంద్రం తీసుకువచ్చిన చట్ట సవరణ బిల్లు విధి విధానాలు ఏమిటనేది సమగ్రంగా తెలియాల్సి ఉంది. అందుకే డ్రైవర్లు ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురి చెయ్యొద్దు. చట్ట సవరణ బిల్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణకు పూనుకుందాం…’ అని రాజశేఖర్రెడ్డి కోరారు.
– రాజశేఖర్రెడ్డి, పెట్రోల్-డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు