Hyderabad | సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్లో నగర పౌరులు నరకం చూస్తున్నారు. అరగంట ప్రయాణానికి గంటకుపైగా సమయం పడుతుందంటూ వాపోతున్నారు. ప్రభుత్వం మారడం, అధికారులు మారడంతో ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వారంతా ఇక్కడ ఉంటామా? వెళ్లిపోతామా? వేరే పోస్టు ఎందుకు చూసుకోవద్దని ఎవరి ప్రయత్నాలలో వారుండడంతో క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కుంటు పడింది.
అసలే ట్రాఫిక్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర పౌరులకు వీఐపీ మూమెంట్ కూడా పెరగడంతో తీవ్రతను మరింతగా పెంచుతున్నది. నగరంలో ట్రాఫిక్పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, అలాంటప్పుడే వాహనాల మూమెంట్ నిరంతరం సాఫీగా వెళ్తుంది. ఏ ఒక్క చోట నిర్లక్ష్యం వహించినా దాని ప్రభావం ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై పడుతుంది. అధికార యంత్రాంగం మార్పుతో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ట్రాఫిక్ విభాగాన్ని పట్టించుకునే వారు లేకపోవడంతో రోజు రోజుకు సమస్య జఠిలమవుతున్నది.
విధులను వదిలేసి.. పోస్టింగ్ల కోసం పైరవీలు
ఉన్నతాధికారులకు కొత్తగా పోస్టింగ్లు వచ్చినా కిందిస్థాయి అధికారులలో కూడా స్థాన చలనం ఉంటుందనే బావన ఉండడంతో వాళ్లు కూడా క్షేత్ర స్థాయిలో చేతులెత్తేస్తున్నారు. ఒక ఠాణా పరిధిలో ఎస్హెచ్ఓ స్థాయి అధికారి పట్టించుకోలేదంటే కిందిస్థాయి అధికారులు నామ మాత్రంగా విధులు నిర్వహిస్తుంటారు. కొందరు ఎస్హెచ్ఓలు, ఏసీపీ స్థాయి అధికారులు తమ పోస్టింగ్ల కోసం తమకు తెలిసిన వారి వద్ద నుంచి పైరవీలు చేయించడంపై దృష్టి పెట్టారు.
గ్రేటర్లో 380 జంక్షన్లుండగా అందులో 85 చోట్ల అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఐటీఎంఎస్ కొనసాగుతున్నది. ఈ టెక్నాలజీతో వాహనాల సంఖ్యను బట్టి స్నిగల్ వ్యవస్థ ఆటోమెటిక్గా పనిచేసే సిస్టమ్ను అమలు చేస్తున్నారు. మూడు కమిషనరేట్లకు ఎక్కడికక్కడే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ను బంజారాహిల్స్కు మార్చారు. అది పూర్థిస్థాయిలో మార్చకపోవడంతో పర్యవేక్షణ లోపం కూడా కన్పిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.
హోంగార్డు నుంచి పైస్థాయి వరకుఅప్రమత్తంగా ఉండాలి
ట్రాఫిక్పై నిరంతరం ఫోకస్ ఉండాలి. ముందుచూపుతో వెళ్లాలి. హోంగార్డు నుంచి పైస్థాయిలో ఉండే అధికారుల వరకు ట్రాఫిక్ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ముందు చూపుతో వెళ్లాలి. నేడు నగరంలో వాహనం నడపడం పద్మవ్యూహంలా మారింది.
మొన్నటి వారు రయ్యూమంటూ వెళ్లే వాహనదారుడు నేడు ట్రాఫిక్లో చిక్కుకొని విల విలలాడుతున్నాడు. సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, మాసబ్ట్యాంక్, లక్డీకాపూల్, అబిడ్స్, నాంపల్లి, చాదర్ఘాట్, హబ్సిగూడ, ఉప్పల్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, సుచిత్రా, కొంపల్లి, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాలలో ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ట్రాఫిక్ జామ్లలో వాహనదారులు చిక్కుకుపోతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి, ఉన్నతాధికారులకు, కమాండ్ కంట్రోల్స్ నుంచి ట్రాఫిక్ను పర్యవేక్షించే వారి మధ్య సమన్వయం ఉండాలి. అలాంటప్పుడు సమస్యలు ఎప్పకటిప్పుడు పరిష్కారమవుతాయి. ఈ విషయాన్ని విస్మరిస్తే నగర పౌరులకు భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలు తప్పవు. ట్రై పోలీస్ కమిషనర్లు ఈ విషయంపై ఫోకస్ పెట్టి ట్రాఫిక్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.
ఎలాగు బదిలీలుంటాయని..
కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిపోయే వారి సంఖ్య పెరుగుతుందని, దీంతోనే నగరంపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని కిందిస్థాయిలో పనిచేసే సిబ్బంది పేర్కొంటున్నారు. ఇదంతా తప్పించుకునేందుకేనంటూ నగర పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 30వ తేదీ వరకు నగరంలో ట్రాఫిక్ జామ్ ఎక్కడ కన్పించలేదు. ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ట్రాఫిక్లో పనిచేసే సిబ్బంది బయటకు వెళ్లాలనే ఆలోచనలో కొందరు, ఎలాగు బదిలీలుంటాయని మరికొందరు తమ విధులను మర్చిపోయారు.
దీనికి తోడు కమిషనర్తో పాటు ట్రాఫిక్ అదనపు సీపీ, ట్రాఫిక్ డీసీపీలు కూడా మారడంతో ఈ విభాగాన్ని పట్టించుకునే వారు లేకుండా పోయారు. అందరూ అదే ఆలోచనలతో ఉండడంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించే వారు కరువయ్యారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువవుతుందంటే ఎప్పకటిప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ మార్పులు చేర్పులు చేస్తూ ఎక్కడ కూడా వాహనాలు ఆగకుండా గతంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.
దీంతోనే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టారు. 2014లో 40 లక్షల వాహనాలుండగా, 2023 నవంబర్ నాటికి 90 లక్షల వరకు పెరిగాయి. అయినా కూడా ట్రాఫిక్ రద్దీ లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్ సాఫీగా సాగింది. దాంతో పాటు 2014లో ఉండే వాహనాల స్పీడ్ గంటకు 20 కిలోమీటర్ల వరకు ఉండగా 2022 నాటికి 27 కిలోమీటర్ల వరకు పెరిగింది.