పెట్రోల్ కొరతతో జనం బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కొన్ని చోట్ల ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తుండగా, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్ దొరకక భారీ క్యూలైన్లలో మండుటెండల్లో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని చోట్ల మూసి ఉన్న పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.

దీంతో ఎక్కడ పెట్రోల్ అందుబాటులో ఉంటే అక్కడ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి మరీ తమ వాహనాలకు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. బైకులు, కార్లే కాదు అంబులెన్స్లు కూడా క్యూలో నిలబడి పెట్రోల్ పోయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇంధనం కొరతతో ఆందోళన చెందుతున్న ప్రజలు అవసరానికి మించి కొనుగోళ్లు చేస్తున్నందువల్లే కృత్రిమ కొరత ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మూడు రాష్ర్టాల ఎన్నికల తర్వాత ఇంధనం రేట్లు పెరుగుతాయన్న ప్రచారంతో వాహనదారులు అవసరానికి మించి కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది.


