దుండిగల్, ఆగస్టు 20: భర్త తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తలేడనే కోపంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు, అధిక సంతానం కారణంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులోకి తోసి తాను దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ సతీశ్కుమార్ తెలిపిన ప్రకారం… కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం, ధర్మారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తితో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తురకవాడగమ్మ గ్రామానికి చెందిన రత్నతో 2014లో వివాహమైంది. వీరికి నలుగురు కుమారులు అజయ్(8), పవన్(7), అరుణ్(3)లతో పాటు ఎనమిది నెలల వయసున్న సుభాష్ ఉన్నారు.
దంపతులు తమ పెద్ద కొడుకులిద్దరు అజయ్, పవన్లను తమ సొంతూరు ధర్మారంలోని లక్ష్మణ్ తల్లిదండ్రుల వద్ద ఉంచి మూడో కొడుకు అరుణ్తో కలిసి రెండేండ్ల కిందట ఉపాధి కోసం నగరానికి వలసవచ్చి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో ఓ రేకుల గదిని కిరాయికి తీసుకుని నివాసముంటున్నారు. వీరికి 8 నెలల కిందట మరో కొడుకు సుభాష్ జన్మించాడు. భర్త లక్ష్మణ్ ఇటుక లారీపై కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అయితే లక్ష్మణ్కు కూతురును కనాలనే కోరిక ఉండగా.. ఇప్పటికే ఎక్కువ సంతానం కలుగడంతో తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని లక్ష్మి భర్తతో గొడవ పడుతున్నది. దీనికి తోడు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సైతం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అనంతరం రాత్రి లక్ష్మణ్ ఇటుక లోడును ఆన్లోడ్ చేసేందుకు లారీపై పటాన్చెరువుకు వెళ్లాడు.
భర్త తన మాట వినడం లేదని తీవ్ర మానసిక ఆందోళనకు గురైన రత్న అర్ధరాత్రి తన ఇద్దరు కొడుకులను ఇంటి ముందున్న నీటి సంపులోకి తోసి అనంతరం తాను దూకింది. అయితే సంపులో 3 ఫీట్ల వరకు మాత్రమే నీళ్లు ఉండటంతో చిన్నారులు నీట మునిగి దుర్మరణం చెందగా, ఆయాసంతో నీటిలో ఉన్న రత్నను పక్క గదిలో నివాసముంటున్న వారు గమనించి బయటకు తీశారు.
అనంతరం పోలీసులకు, భర్తకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్మార్టం నిమిత్తం చిన్నారులు అరుణ్, సుభాష్ మృతదేహాలను గాంధీకి తరలించారు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రత్న ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఆమె ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని పోలీసులు పేర్కొన్నారు.