Tragedy | చర్లపల్లి : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదని సొంత కూతురినే ఓ తల్లి హత్య చేసింది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్సై షఫీ కథనం ప్రకారం.. కుషాయిగూడలో నివాసముండే రమేశ్కుమార్, రాజబోయిన కల్యాణి(22) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి తన్విత(4) కూతురు ఉన్నది. భార్యాభర్తల మధ్య రెండేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో కల్యాణి తన కూతురు తన్వితతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది. ఈనెల 1వ తేదీన స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కూతురు తన్వీతను తల్లి కల్యాణి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత విషయం బయటపడకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్ వైద్యశాలకు తరలించింది. తన్వితను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కల్యాణి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మృతురాలి తండ్రి రమేశ్కుమార్ సమాచారం అందించారు.
కూతురు తన్విత మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ కల్యాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా, గత కొంత కాలంగా జనగాం జిల్లాకు చెందిన ఇండ్ల నవీన్కుమార్(19)తో కల్యాణి చనువుగా ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు.. కల్యాణిని అదుపులోకి తీసుకొని విచారించడంతో తానే అడ్డు తొలగించుకునేందుకు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకున్నది. వెంటనే నవీన్కుమార్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రాజబోయిన కల్యాణి, ఇండ్ల నవీన్కుమార్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.