2011తో పోలిస్తే 149 శాతం పెరుగుదల
హరితహారంతో ఎటు చూసినా పచ్చందాలే
7 విడుతల్లో పది కోట్లకు పైగా మొక్కలు
దేశంలోని మెగా సిటీల్లో హైదరాబాద్ నం.1
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టులో వెల్లడి
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,జనవరి 13 (నమస్తే తెలంగాణ);హరితోద్యమం విజయకేతనమైంది.. మహానగరం పచ్చనిబాటలు పరుచుకుంది..దేశంలోని మిగతా మెగా నగరాలను తలదన్ని పచ్చని కిరీటాన్ని తొడిగింది. పదేండ్ల కాలంలో ఏకంగా 149 శాతం పచ్చదనం పెరిగింది. కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు (ఐఎస్ఎఫ్ఆర్)-2021 ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా పదిమిలియన్లు జనాభా దాటిన ఏడు నగరాల్లో సర్వే నిర్వహించింది. అడవుల పెరుగుదల, పచ్చదనంపై విస్తృతంగా ఆరా తీసింది. మెగా నగరాల జాబితాలోని పలు కీలక నగరాల్లో పచ్చదనం తగ్గుముఖం పట్టగా, హైదరాబాద్లో అడవులు (ఓపెన్ ఫారెస్ట్) గణనీయంగా పెరగడం విశేషం. అంతేకాదు నగర భౌగోళిక విస్తీర్ణంతో పోలిస్తే అడవుల విస్తీర్ణం ఎక్కువున్న జాబితాలో హైదరాబాద్ దేశంలో రెండో స్థానంలో నిలువడం గర్వకారణం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడేండ్ల కాలంలో గ్రేటర్ పరిధిలో పది కోట్ల మొక్కలు నాటారు. నాటడమే కాదు.. వాటి సంరక్షణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపడుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహార సంకల్పం..
చారిత్రక నగరానికి పచ్చని కిరీటాన్ని తొడిగింది.భావితరాలకు పచ్చదనాన్ని అందించాలనే ముందుచూపు… విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు పచ్చని కోకను తొడిగింది. గత దశాబ్ద కాలంతో పోలిస్తే హైదరాబాద్ మహానగర పరిధిలో పచ్చదనం ఏకంగా 149 శాతం పెరుగుదల నమోదైనదనే
కేంద్ర ప్రభుత్వ నివేదిక ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు (ఐఎస్ఎఫ్ఆర్)-2021లో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోని మెగా నగరాల్లో పచ్చదనం తగ్గుముఖం పట్టగా… అన్నింట్లో కంటే హైదరాబాద్లోనే అడవులు (ఓపెన్ ఫారెస్ట్) గణనీయంగాపెరగడం విశేషం. అంతేకాదు… నగర భౌగోళిక విస్తీర్ణంతో పోలిస్తే అడవుల విస్తీర్ణం ఎక్కువగా
ఉన్న నగర జాబితాలో హైదరాబాద్ దేశంలో రెండో స్థానంలో ఉంది.
దేశవ్యాప్తంగా అడవుల పెరుగుదల-తగ్గుదల ఎలా ఉందనే దానిపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పలు కోణాల్లో సర్వే నిర్వహించింది. రాష్ర్టాల వారీగా పరిస్థితి ఎలా ఉందనే దానితో పాటు దేశంలో అత్యంత కీలకమైన మహానగరాల్లోనూ పచ్చదనం ఎలా ఉందనే దానిపైనా దృష్టిసారించింది. ఇందులో భాగంగా 2011 జనాభా లెక్కల ప్రకారం… పది మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెగా సిటీల్లో అడవుల తీరు ఎలా ఉందనే దానిపై సర్వే నిర్వహించేందుకు ఏడు నగరాలను ఎంచుకుంది. అందులో హైదరాబాద్ సహా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాలు ఉన్నాయి. ఈ ఏడు మహా నగరాల భౌగోళిక విస్తీర్ణం 4,990.01 చదరపు కిలోమీటర్లు ఉండగా… తాజాగా వీటిల్లో 10.21 శాతం అంటే 509.72 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నట్లుగా సర్వే నివేదికలో స్పష్టం చేశారు.
12.90% విస్తీర్ణంలో..
హైదరాబాద్ మహానగరం 634.18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా… ఇందులో ఏకంగా 12.90 శాతం విస్తీర్ణంలో అడవులు ఉన్నట్లుగా తాజా నివేదికలో వెల్లడైంది. దేశంలోని ఏడు నగరాలతో పోలిస్తే… హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ముంబై విస్తీర్ణం 435.91 చదరపు కిలోమీటర్లు ఉంటే అక్కడ 110.77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఢిల్లీ భౌగోళిక విస్తీర్ణంలో 12.61 శాతం అడవులు ఉన్నాయి. ఇక మిగిలిన ఏ ఒక్క నగరంలోనూ అడవుల విస్తీర్ణం ఏడు శాతం కూడా దాటలేదు.
చరిత్రను తిరగరాసిన హరితహారం..
హైదరాబాద్ నగరమంటేనే కాంక్రీట్ జంగిల్ అనేది నిన్నటి మాట. గతంలో నగరం విస్తరించేకొద్దీ ఈ కాంక్రీట్ జంగిల్ కూడా తన పరిధిని పెంచుకుంటూపోయేది. తద్వారా భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడంతో పాటు దక్కన్ పీఠభూమిలో మంచి వాతావారణానికి వేదికగా నిలిచే ఈ చారిత్రక నగరం అందుకు భిన్నంగా అడుగులు వేసే దుస్థితికి చేరుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం హైదరాబాద్ దశ-దిశను మార్చింది. ప్రధానంగా 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతం విస్తరింపచేసేలా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. భావితరాలకు మంచి నగరాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏడు విడతలుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా పది కోట్లకు పైగా మొక్కలు నాటారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్ల పరిధిలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా అక్కడ మొక్కలు నాటి సంరక్షించేలా కార్యాచరణను రూపొందించింది. కాలనీలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు , పార్కులు, లే అవుట్ ఖాళీ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలకు ఇరువైపుల మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకు భాగస్వాములైన ఈ క్రతువుతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. దీంతో దేశంలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అనేక మంది పర్యావరణ వేత్తలు కొనియాడిన సందర్భాలు ఉన్నాయి.