సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): పని చేసే ప్రదేశానికి సమీపం.. మంచి వెలుతురు, గాలి.. ప్రధానంగా వైద్య సేవలు అందుబాటులో ఉండే లొకేషన్. ఇదీ కొవిడ్ తర్వాత నగరంలోని గృహ కొనుగోలుదారుల్లో మారిన అభిరుచుల తీరు. అంతేకాదు.. రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని నైట్ఫ్రాంక్ ఇండియా తాజా సర్వే వెల్లడించింది. దేశంలోని పలు మెట్రో నగరాల్లో గృహ అమ్మకాలు, ఇంటిని కొనుగోలు చేసే వారి ఆసక్తి, రేట్ల వంటి అంశాలపై ‘నైట్ఫ్రాంక్ ఇండియా కొనుగోలుదారుల సర్వే-2021’ నిర్వహించింది. ఇందులో ప్రధానంగా ఉద్యోగులు తాము పని చేసే ప్రదేశానికి సమీపంలోనే ఇంటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా వెల్లడైంది. ఈ జాబితాలో ముంబై ముందు వరుసలో నిలువగా.. తర్వాత పుణె రెండోదిగా.. మూడో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. నగరంలో ఏకంగా 78 శాతం మంది కొనుగోలుదారులు ఇలా పని చేసే ప్రదేశానికి చేరువలోనే ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా నైట్ఫ్రాంక్ సర్వే స్పష్టం చేసింది.
ముంబైలో 92శాతం మంది ఇటువైపు మొగ్గు చూపుతుండగా, పుణెలో 81శాతం మంది ఉన్నారు. కొవిడ్ కారణంగా ఉద్యోగులు ఏడాదిన్నర పాటు వర్క్ ఫ్రం హోంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. వారంలో రెండు, మూడు రోజుల పాటు కార్యాలయానికి వెళ్లినా (వర్క్ ఎట్ ఆఫీస్) మిగిలిన రోజుల్లో ఇంట్లోనే ఉండి పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కొనుగోలుదారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సర్వేలో పేర్కొన్నారు. మరోవైపు ప్రతి ఐదుగురిలో ఇద్దరు రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా సర్వేలో తేలిందని పేర్కొన్నారు. అం దునా రెండో ఇంటి కొనుగోలులో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రధానంగా కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చక్కటి వెలుతురు, గాలితో పాటు మంచి పచ్చదనం, మంచి వైద్య సేవలు అందుబాటులో ఉండే ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.