BJP | సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాషాయ పార్టీ నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరుగా ఉంది. గ్రేటర్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఏ నియోజకవర్గానికి కూడా సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ‘ఇంకేముంది మనకంటే ఎవ్వరూ గొప్పా’ అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం తాపత్రయ పడుతున్నారు. గ్రేటర్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 20కి పైగా దరఖాస్తులు స్టేట్ బీజేపీ ఆఫీసుకు చేరాయి. అయితే వాటి పరిశీలన ఇప్పుడు అగ్ర నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వచ్చిన దరఖాస్తుల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలుపు గుర్రాలు లేవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో ఒకరిని ఎంపిక చేస్తే మిగిలిన వారు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలిసింది. వీరిని కాదని కొత్త వారికి టికెట్ కేటాయిస్తే ఉన్న ఆ కొద్దిపాటి క్యాడర్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. దీంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. మహానగరంలో 24 శాసన సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఇప్పట్లో తేలేటట్టు కనిపించడం లేదు.
అంతో ఇంతో పట్టున్న అంబర్పేటలో, గత ఎన్నికల్లో గోషామహల్ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఆ స్థానాల్లోనూ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ విధించడంతో ఆ పార్టీ నుంచి 31 మంది నాయకులు గోషామహల్ సీటు కోసం పావులు కదుపుతున్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి కొడుకు ఉన్నారు. మరో ఇద్దరు ఆ పార్టీ జాతీయ కార్యవర్గంలో సభ్యులుగా ఉన్నారు. ఈ టికెట్ కోసం వారు ఇప్పటికే అగ్ర నాయకుల వద్ద చర్చిస్తున్నారు. అయితే పార్టీ రాజాసింగ్పై సప్పెన్షన్ ఎత్తేసి టికెట్ కేటాయిస్తే ఆ 31 మంది నాయకులు పార్టీకి మద్దతు ఇవ్వడం కష్టమేనని కమలం నాయకులు వాపోతున్నారు. మరో నియోజకవర్గం అంబర్పేటలో కమలం నాయకుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన భార్యకు ఆ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించనున్నట్లు ఆ పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అందుకే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి ఆయన భార్య అంబర్పేట కార్పొరేటర్ పద్మ ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. దీంతో కిషన్ రెడ్డికి ఆ నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
గ్రేటర్లో మిగిలిన నియోజకవర్గాల్లోనూ బీజేపిది అగమ్యగోచరంగా ఉంది. కంటోన్మెంట్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, మలక్పేట, నాంపల్లి తదితర నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 20 నుంచి 40 దరఖాస్తులు వచ్చాయి. కంటోన్మెంట్ టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకోగా అందులో మాజీ మంత్రి శంకర్రావు కూతురు సుస్మిత కూడా ఉంది. ఈ ప్రాంతం నుంచి ఉద్యోగ సంఘం నాయకుడు, మరొక జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్లో అభ్యర్థులు కరువయ్యారు. కొత్తవారు వస్తే ఓటమి ఖాయం.. పాత వారికి ఇస్తే డిపాజిట్లు అయిన దక్కుతాయని ఆ పార్టీ నాయకులు చెప్పారు.
గ్రేటర్ బీజేపీ టికెట్లు ప్రకటిండచమే ఆలస్యం.. భారీగా బీఆర్ఎస్లోకి వలసలు ఉండనున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. ముషీరాబాద్ నుంచి బీజేపీ అగ్ర నాయకులు ఇప్పటికే అంతర్గతంగా హోరాహోరీగా పోటీపడుతున్నారు. ఓవైపు లక్ష్మణ్, మరోవైపు దత్తాత్రేయ. ఒకరు తన అనుచరుడి కోసం.. మరొకరు కూతురు కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఏ ఒక్కరికి టికెట్ కేటాయించినా మిగిలిన క్యాడర్ పార్టీ మారే యోచనలో ఉన్నట్టు ఆ ప్రాంత బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు. వీరికి పోటీగా ముషీరాబాద్ నుంచి 24 దరఖాస్తులు పార్టీ ఆఫీసుకు చేరాయి. ఖైరతాబాద్లోనూ చింతల రామచంద్రారెడ్డికి పోటీగా 27 మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ టికెట్ల ప్రక్రియ ఖరారు చేస్తే రాని వారంతా తమ క్యాడర్తో బీఆర్ఎస్లోకి రావడానికి మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది.