తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 26 : మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతోనే ప్రతియేటా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం, నిత్యం వ్యాయామంతో ఈ వ్యాధిని అరికట్టవచ్చన్నారు. రెడ్హిల్స్లో ఉన్న ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో రూ.30 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన రోబోటిక్ ఆపరేషన్ థియేటర్ సహా 8 మాడ్యులర్ థియేటర్లు, దోబీఘాట్, వంటశాలను శుక్రవారం హోంశాఖ మంత్రి మహమూద్అలీతో కలిసి ప్రారంభించి వాటి పనితీరు తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ప్రాథమికదశలో గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు రూ.750 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా అధునాతన వైద్యసేవల కోసం రూ.30 కోట్లతో 8 మాడ్యులర్ థియేటర్లను ఏర్పాటు చేయడంతో మెరుగైన సేవలందే అవకాశం ఉందన్నారు.
దక్షిణ తెలంగాణలో ఎంఎన్జేలో రోబోటిక్ థియేటర్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. క్యాన్సర్ రోగుల తాకిడి పెరుగుతుండడంతో పడకల సంఖ్య పెంచుతామని.. రోగులు, వారి సహాయకులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందించేందుకు మోడ్రన్ కిచెన్ ఏర్పాటు చేశామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, సమయపాలన పాటించాలని వైద్యులు, సిబ్బందికి మంత్రి సూచించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పలువురు వేతనాల పెంపు విషయంపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, జనార్ధన్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలత, వైద్యులు రాజ్కుమార్ జాదవ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే తొలి ఆంకాలజీ నర్సింగ్ స్కూల్ : ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో త్వరలో ఆంకాలజీ నర్సింగ్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. అధునాతన బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మొబైల్ స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ రోగులను గుర్తించి చికిత్స అందించేలా జిల్లాల్లో క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.