గత పాలకుల హయాంలో వసతుల లేమితో కునారిల్లిన ప్రభుత్వాస్పత్రులు స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందిస్తున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి పోయి.. ప్రభుత్వ దవాఖానలకు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా దశల వారీగా గవర్నమెంటు వైద్యశాలలను అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నది. రోగులు ఇక్కట్లు పడకుండా అదనపు పడకలనూ మంజూరు చేస్తున్నది. ఇందులోభాగంగానే ఎంఎన్జేలోనూ మరిన్ని పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో 450 బెడ్లు ఉండగా, అదనంగా మరో 300 మంజూరయ్యాయి. కొత్తగా నిర్మించిన భవనంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అందులో వంద పడకలను మహిళలకు కేటాయిస్తూ.. ప్రత్యేక బ్లాక్ను నెలకొల్పారు. అలాగే పిల్లల కోసం, బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్కు ప్రత్యేక బ్లాకులను సైతం ఏర్పాటు చేశారు. కాగా, అదనపు పడకలు అందుబాటులోకి వస్తే మొత్తం ఆ సంఖ్య 750కి చేరుకుంటుంది.
క్యాన్సర్ రోగుల కన్నీళ్లను తుడిచి వారి జీవితాల్లో కొత్త చిగురులు తొడిగేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక వార్డులు, దవాఖాన సామర్థ్యం పెంపు.. ఇలా అన్ని వసతులు సమకూర్చుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించి, బతుకుపై భరోసాను కల్పించేందుకు మానవీయంగా స్పందిస్తున్నది. అన్ని వసతులతో త్వరలో ప్రారంభం కానున్న నగరంలోని ఎంఎన్జే హాస్పిటల్ రోగుల పాలిట వరంలా మారనున్నది.
సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ రోగులతో నిత్యం రోజు రోజుకు రద్దీ పెరిగిపోతున్న ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఇక పడకల కొరత తీరనున్నది. ఇప్పటికే కార్పొరేట్ స్థాయిలో సేవలందిస్తున్న దవాఖానలో పడకలు తక్కువగా ఉండడంతో ఐపి రోగులకు కొంత నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుతం దవాఖాన సామర్థ్యం 450 పకడకలు ఉండగా నిత్యం పదుల సంఖ్యలో అడ్మిషన్లు జరుగుతుంటాయి. దీంతో పడకల కొరత తప్పడం లేదు. దీనిని గమనించిన ప్రభుత్వం ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని నిరుపేదలకు పూర్తి ఉచితంగా అందించే క్రమంలో ఎంఎన్జే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా నిర్మించిన భవనంలో అదనంగా మరో 300 పడకలను మంజూరు చేసింది. దీంతో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సామర్థ్యం 450నుంచి 750కి పెరిగింది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 300 పడకలతో కొత్త బ్లాక్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నూతన భవన నిర్మాణ పనులు పూర్తవడంతో మరో వారం రోజుల్లో ఎంఎన్జే నూతన భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
100 పడకలతో మహిళలకు ప్రత్యేక బ్లాక్..
కొత్తగా అందుబాటులోకి రానున్న 300 పడకలలో 100 పడకలను మహిళలకు కేటాయించారు. అంతే కాకుండా మహిళల కోసం ప్రత్యేక బ్లాక్ను ఏర్పాటు చేశారు. ఇందులో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి వాటితో పాటు ఇతర క్యాన్సర్ వ్యాధులకు గురైన మహిళలకు చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు. దీని వల్ల రోజువారి ఓపితో పాటు శస్త్రచికిత్సలు, పరీక్షలు వంటి వాటికోసం మహిళలు జనరల్ ఓపిలో నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. వారికోసం ప్రత్యేక ఓపి ఉంటుంది. ముఖ్యంగా శస్త్రచికిత్సల విషయంలో కూడా నిరీక్షణ తప్పుతుందని డైరెక్టర్ తెలిపారు.
మరింత బలోపేతంగా మెడికల్ అంకాలజి..
క్యాన్సర్ రోగుల చికిత్సలో కీలకమైనది మెడికల్ అంకాలజి కోసం ప్రత్యేక బ్లాక్ను ఏర్పాటు చేసి రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించనున్నారు.
బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్కు ప్రత్యేక బ్లాక్..
క్యాన్సర్ చికిత్సలోనే అత్యంత ఖరీదైన బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ను నిరుపేద రోగులకు ఉచితంగా అందించే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ కోసం ప్రత్యేక బ్లాక్ను నిర్మించింది. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, ఐసీయూ తదితర సౌకర్యాలతో బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ సిద్ధమైంది.
పిల్లల కోసం..
చిన్నపిల్లలకు సంబంధించి కూడా ప్రత్యేక బ్లాక్ను నిర్మించారు. ప్రస్తుతం ఉన్న పాత దవాఖానలో పిల్లల వార్డు వేరుగా ఉన్నప్పటికి స్థలాభావం వల్ల అన్ని రకాల సౌకర్యాలు ఒకదగ్గర లేవు. కొత్త భవనంలో పిల్లలకోసం ప్రత్యేక బ్లాక్ను ఏర్పాటు చేయనున్నట్లు దవాఖాన డైరెక్టర్ డా.జయలత తెలిపారు. పిల్లలకు అవసరమైన వైద్య సౌకర్యాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడం ఈ బ్లాక్ ప్రత్యేకత. అంతే కాకుండా పిల్లలకు సంబంధించిన ఓపి, ఐపి సేవలు కూడా ఇదే బ్లాక్లో వేరుగా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రోగులందరికీ ఒకేచోట ఓపి సేవలు అందిస్తుండడం వల్ల పిల్లలకు సైతం నిరీక్షణ తప్పడం లేదు. ఈ ప్రత్యేక బ్లాక్లు అందుబాటులోకి వస్తే ఆ కష్టాలు తీరనున్నాయి.
మెరుగైన సేవలు
ఎక్స్టెన్షన్ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎక్విప్మెంట్, బెడ్స్ వంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారం రోజుల్లో నూతన బ్లాక్ అందుబాటులోకి రావచ్చు. కొత్త బ్లాక్ అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్యం అందుతుంది. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషకరం.
– డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్,
24/7 ల్యాబ్
డెంటల్ ల్యాబ్
జెనటికల్ ల్యాబ్
మాలిక్యూలర్ అంకాలజి
రేడియేషన్ బంకర్లు-2
లుకేమియా వార్డు
ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం.
బోన్మ్యారో శస్త్రచికిత్సలకు సంబంధించి రెండు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు.