సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే ఉరుకలు.. పరుగులు పెట్టాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశ లోకల్ సర్వీసుల ఊసే కనిపించడం లేదు. పైగా హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసులలో (ఎంఎంటీస్) భారీ స్థాయిలో కోతలు పెట్టింది. కాగా, ఈ నెల 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఫేజ్-1లో అదనపు సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు రైల్వే శాఖ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టులలో భాగంగా సికింద్రాబాద్-మేడ్చల్ మధ్యలో దాదాపు 28 కిలోమీటర్ల వరకు ఫేజ్-2 కింద నరేంద్రమోదీ ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పుతున్నప్పటికీ ఇదంతా ఎన్నికల స్టంట్గా మేధావులు, జంటనగర ప్రజలు భావిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారని చెబుతున్నారు. కానీ ఆ వివరాలు ప్రకటించలేదు. అయితే ఇప్పటికే పూర్తయి రన్నింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులనే ప్రారంభించే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రధాన మంత్రి నిర్ణయం ఎంతవరకు సమంజసం అన్న విమర్శలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.
ఎంఎంటీఎస్ రెండో దశలో ఐదు మార్గాలు..
ఎంఎంటీస్ రెండో దశలో ఐదు మార్గాలలో ప్రాజెక్టు లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం 2012-13లో నిధులు మంజూరయ్యాయి. అందులో భాగంగా సికింద్రాబాద్-బొల్లారం- మేడ్చల్ 28 కిలో మీటర్లు, ఫలక్నుమా-ఉమ్దానగర్-శంశాబాద్ ఎయిర్పోర్టు 20 కిలో మీటర్లు, సికింద్రాబాద్-మౌలాలి-ఘట్కేసర్ 19 కిలోమీటర్లు, మౌలాలి-సనత్నగర్ 21 కిలోమీటర్లు, కాచిగూడ- సీతాఫల్ మండి- మల్కాజిగిరి- మౌలాలి మధ్య 10 కిలో మీటర్ల మేర మొత్తం ఐదు మార్గాలలో ఫేజ్-2 పనులు పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇంత వరకు నత్తనడకన పనులు కొనసాగుతున్నాయే తప్ప అడుగు ముందుకు పడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రం సిద్ధంగా ఉన్నా..
2003 నుంచి లోకల్ రైలు సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. కాగా, డిమాండ్ మేరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టారు. వాస్తవానికి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు 2012-13 బడ్జెట్లో ప్రతిపాదించారు. అందుకోసం రూ.816 కోట్లు నిధులు అంచనా వేశారు. ఆ నిధులలో మూడో వంతు వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.179 కోట్లు గతంలోనే విడుదల చేయగా.. గత ఏడాది నవంబర్లో మరో 200 కోట్లు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలోనే మిగిలిన రూ.165 కోట్లు కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి హాజరవుతున్న ప్రధాని మోదీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మిగతా రైల్వే ప్రాజెక్టుల వివరాలను రైల్వే శాఖ ఎందుకు గోప్యంగా ఉంచుతున్నది, వాటిని ముందుగా ఎందుకు ప్రకటించడం లేదన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.