చిక్కడపల్లి, జూలై 22 : సాయిచంద్ విశిష్ట గాయకుడు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సాయిచంద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయిచంద్ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ తదితరులు హాజరై సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజా చైతన్యం తీసుకువచ్చిన గాయకుడు సాయిచంద్ అని అన్నారు. శృతిపై పట్టు ఉన్న గాయకుడు సాయి అని, ఆయన పాటలు హృదయానికి తాకేవని వివరించారు. ఒక పాటతో ఓ ప్రదర్శన చేసే గాయకుడు సాయిచంద్ అని కొనియాడారు. తన గాత్రంతో రాయిని సైతం కరిగించగల గాయకుడు అని, ఆయన పాటలతో అందరి మనస్సులో నిలిచిపోయారని అన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. సాయిచంద్ గొప్ప గాయకుడని పేర్కొన్నారు. దేశంలో దారుణాలు జరుగుతున్నాయని, మణిపూర్ ఘటన జరిగి రెండు నెలలైనా కూడా ప్రధానమంత్రి స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కుల, మతాలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని, మతాలు నశించాలన్నారు. గాయకుడు యశ్పాల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సాయి చంద్ తండ్రి వెంకటరాములు, జయరాజ్, విమలక్క, పద్మ, గంధం రాములు తదితరులు పాల్గొన్నారు.