సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): గతంలో విఫలమైన ప్రణాళికలకు ఇప్పుడు 99 రోజులెందుకని, మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారా?అని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక- 99 రోజుల యాక్షన్ ప్లాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో అనేక ప్రణాళికలు, ప్రయోగాలు చేసినా ఆశించని ఫలితాలు ఇవ్వలేదని విమర్శించారు. కొత్తగా 99 రోజులని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమాలకు జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఏ ప్రాతిపదికన చేశారో వెల్లడించాలని కోరారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉందని, ఫాగింగ్ చర్యలు సమర్థంగా చేపట్టేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ 99 రోజుల్లో చేపట్టబోయే పనులు, లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించాలని కోరారు. బస్తీ దవాఖానల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.