హైదరాబాద్ : అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం చార్మినార్ వద్ద గల గుల్జార్ హౌస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలుసుకున్న వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని అన్నారు. ఈ ఘటన చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.
భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాపారులు, ప్రజలు కూడా అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన చెప్పారు.