బన్సీలాల్పేట్, ఏప్రిల్ 28 : గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్కు(Padma Rao Goud) మద్దతుగా ఆదివారం మారేడ్పల్లిలోని తన నివాసంలో సనత్నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో డివిజన్ల వారీగా ఆయన సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థి టి.పద్మారావుకు ఎక్కడకు వెళ్లినా ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఆయనకు రోజురోజుకి ప్రజాధరణ పెరుగుతున్నదని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సనత్నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని సూచించారు.
లోక్సభ ఎన్నికల్లో(Parliament elections) బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, పద్మారావు గౌడ్ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఐదేండ్లు అభివృద్దిని పట్టించుకోని బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉండి కూడా ప్రజలకు దూరంగా ఉన్న కిషన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు. బూత్స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో పటిష్టంగా ఉన్నదని, రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపిగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారి మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.