హైదరాబాద్ : కంటోన్మెంట్(Cantonment) ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. గురువారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జి.నివేదిత, బోర్డు మాజీ సభ్యులు, ముఖ్య నేతలతో ఎన్నికల ప్రచార సరళిపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే సాయన్నకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, నియోజకవర్గ ప్రజలందరూ సాయన్న కుటుంబ సభ్యులేనని తెలిపారు. సాయన్న బిడ్డ నివేదితకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని, ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఏడాది కాలంలోనే తండ్రిని, చెల్లిని కోల్పొయిన అభ్యర్థి నివేదితకు ప్రజలందరూ దీవెనలు అందించాలని కోరారు.
నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ సహకారంతో కంటోన్మెంట్లో సాయన్న ఎన్నో అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఏరియా రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికి సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా చొరవ చూపారని గుర్తు చేశారు. సాయన్న బిడ్డ నివేదితను కడుపులో పెట్టుకొని కాపాడుకోవల్సిన బాధ్యత అందరి పైన ఉందని అన్నారు. అలాగే మల్కాజ్గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులిద్దరు నాన్ లోకల్ అని, లోకల్ అయిన రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమన్నారు