హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో విసుగు చెందిన ప్రజలు నాడు ఆదర్శవంతమైన పాలన అందించిన బీఆర్ఎస్(BRS) ప్రభ్యత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన సికింద్రాబాద్ (Secunderabad) పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో విద్యుత్, నీటి కష్టాలు మొదల య్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచిందని విమర్శించారు.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో సమిష్టిగా పని చేసి సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పద్మారావు గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.