సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎల్బీనగర్లో కాంగ్రెస్, బీజేపీలు తర్జన భర్జన పడుతున్నాయి. దీంతో ఆ పార్టీల క్యాడర్ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం ఎమ్మెల్యే అభ్యర్థినంటూ నియోజకవర్గంలో తిరిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు, అలాంటిది వారి వారి నాయకులకు టిక్కెట్టు రాదనే తేలిపోతుండటంతో ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. ఎల్బీనగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్రెడ్డి నియోజకవర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేశారు.
ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గతంలో ఏ పార్టీ హయాంలోనూ జరుగలేదు, దీంతో స్థానిక ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ప్రస్తుత ఎమ్మెల్యేకు ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఇప్పుడు ప్రతి పక్ష పార్టీల నాయకుల్లో ఆందోళన కల్గిస్తుండటంతో… ఎవరిని పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయాలనే ఇంకా చర్చలు జరుపుతున్నారు. ఇదే ఆ పార్టీ క్యాడర్ను నిరుత్సాహానికి గురిచేస్తున్నది. తమ నాయకుడు పేరు వస్తుందని ఆలోచనలో ఉన్న సమయంలో ప్యారాచూట్ నాయకుల పేర్లు వినిపించడం, అంతలోనే మరో నాయకుడి పేరు తెరపైకి రావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా నిర్ణయించలేని పరిస్థితిలో ఉన్న పార్టీలో మనమున్నామా? అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. బలమైన నాయకత్వం ఉన్నచోటకు వెళ్లడంతోనే గుర్తింపు, అభివృద్ధి, ప్రజలకు సేవ చేసే అవకాశాలుంటాయనే భావనలో ఆయా పార్టీల క్యాడర్ మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.