హైదరాబాద్ : ఎస్ఎన్డీపీ నిధులతో చేపడుతున్న నాలా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indrareddy) ఆదేశించారు. పనుల్లో జాప్యం జరుగకుండా వర్షాకాలంలోగా పూర్తి చేయాలని సూచించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ వడివిజన్ వరలక్ష్మినగర్, సాయి బాలాజీ, సాయి కృష్ణ కాలనీలలో జరుగుతున్న ఎస్ఎన్డీపీ(SNDP Works) పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నాలా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంపు కాలనీల ప్రజల సమస్యలను పరిష్కరించడానికే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించామని తెలిపారు. గతంలో వర్షం వస్తుందంటేనే ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం గడిపే వారన్నారు. సమస్యను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించానని వెల్లడించారు.
పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరిగిందని ఇకపై త్వరగా పనులు పూర్తి చేయించాలన్నారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో అధికారుల పర్యావేక్షణ తప్పని సరిగా ఉండాలన్నారు. ఆమె వెంట కార్పొరేటర్లు పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, సూర్ణ గంటి అర్జున్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద బావి ఆనంద్రెడ్డి, సంరెడ్డి వెంకట్రెడ్డి, బీమిడి జంగారెడ్డి, అధికారులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.