బడంగ్పేట, డిసెంబర్ 3: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకిచ్చిన హమీని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. జల్పల్లి మున్సిపాలిటీలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇచ్చిన వారందరికి తులం బంగారం ఇచ్చే వరకు కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. మహిళలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన రిజర్వాయర్లను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని.. కొత్తగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి శూన్యం అన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మార్పు పేరుతో ప్రజలను మాయ చేశారన్నారు.
భవిష్యత్లో నీటి సమస్య రాకుండా ఉండటానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సమస్య లేకుండా చేశారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ శివారు పరిధిలో ఉన్న మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజక వర్గాల్లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి రూ.1200 కోట్లు, మహేశ్వరం నియోజకవర్గానికి రూ.260 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కేసీఆర్ నిర్మించిన రిజర్వాయర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని చెప్పారు. ప్రజలకు రోజు విడిచి రోజు తాగునీరివ్వాలని, పాత పైపులైన్లు తొలగించి నూతన పైపులైన్లు వేయించాలన్నారు.
రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి బస్తీ దవాఖానలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయించారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోనే 13 బస్తీ దవాఖానలు, 9 అర్బన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానల్లో డాక్టర్లు లేరని, మందుల కొరత ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జల్పల్లి మున్సిపాలిటీకి గతంలో కేటాయించిన రూ.50 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బాలాపూర్ తాసీల్దార్ ఇంద్రాదేవి, చైర్మన్ అబ్దుల్లా, వైస్ చైర్మన్ ఫర్హానా, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు ఉన్నారు.