BRS | బడంగ్పేట, మార్చి 24: చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపిస్తే సబండ వర్గాలకు సేవ చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జిల్లెలగూడలోని సామ యాదిరెడ్డి గార్డెన్లో ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి రాజేందర్నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ గుప్తా, తదితరులు హాజరయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని శపథం చేశారు.
ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలు శ్రమించకుండా ఏ లీడర్ గెలువలేడన్నారు. గతంలో జెడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా పనిచేసి ఎంతో మార్పు తీసుకొచ్చానని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, ఉపాధ్యక్షుడు చంద్రయ్య, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మీర్పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, బడంగ్పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, ఆర్కేపురం అధ్యక్షుడు నాగేశ్, మహేశ్వరం అధ్యక్షుడు రాజునాయక్, కందుకూరు అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, తుక్కుగూడ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, జిల్లెల కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు , నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారు. ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎంపీ రంజిత్ రెడ్డి ఐదేండ్ల కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించుకొని పార్టీ మారారు. గత పదేండ్లలో లేని కరువు.. రెండు నెలలు కష్ట పడుదాం.. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరిద్దాం. కాసానిని ఎంపీగా గెలిపించుకుందాం. ఐదు సంవత్సరాలు పనిచేయించుకుందాం.
– ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య
కాంగ్రెస్ పాలన వందరోజులు కాక ముందే జనరేటర్లు తీసుకువచ్చింది. ప్రజలందరినీ అంతర్మథనంలో పడేసింది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను అన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తున్నది. కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ చేస్తున్న ఆరాచకాలను, కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలి.
– ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, వాణీదేవి, దయానంద్ గుప్తా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ను నిషాన లేకుండా చేస్తావా.?ఎందుకు ఇంత అహంకారమని రేవంత్రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కరెంటు కోతలు, రైతుల పంటలు ఎండబెట్టడం, రైతుబంధు నిలిపివేత ఇలా అనేక మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఏం చేశాడో రేవంత్ రెడ్డికి కనిపిస్తలేదా..? రేవంత్ రాకపోకలు సాగిస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, విశాలంగా మారిన రోడ్లు కేసీఆర్ వేసినవేనని తెలుసుకోవాలని హితవు పలికారు.
ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లలో కేసీఆర్ కన్పిస్తున్నడు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, ఇలా అనేక సంక్షేమ పథకాల రూపంలో కేసీఆర్ కన్పిస్తున్నాడన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్షతో రంజిత్ రెడ్డి చేవెళ్లకు ఎంపీగా గెలిచారని, అంతకు ముందు ఎవరికీ తెలియదన్నారు. భిక్ష పెట్టిన కేసీఆర్నే స్వార్థంకోసం మోసంచేసి కాంగ్రెస్లో చేరారని.. ఇలాంటి మోసకారి రంజిత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్కు కాసాని జ్ఞానేశ్వర్ సుపరిచితుడని తెలిపారు. గతంలో జెడ్పీ చైర్పర్మన్గా, ఎమ్మెల్సీగా 96 కులాల గొంతుకగా పనిచేసిన నిబద్దత గల నాయకుడికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి 60వేల మెజార్టీ ఇద్దామని, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలను నమ్మి మరోమారు మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
పీర్జాదిగూడ, మార్చి 24 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతివనం పార్కు, నందనవనం పార్కులలో స్థానిక మేయర్ జక్క వెంకట్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వాకర్స్కు వివరించారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మాల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎంపల్లి అనంతరెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, వాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.