బడంగ్పేట, ఏప్రిల్ 30 : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు.. ఆయన భాష చూస్తుంటే ఇంకా పీసీసీ హోదాలోనే కొనసాగుతున్నట్లు అనిపిస్తున్నది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి తిరుమల్నగర్లో చేవెళ్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలలో ప్రజలు మా గొంతులు ఎండుతున్నాయని గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. అధికారంకోసం అలవి కాని హామీలు ఇచ్చి.. ఇప్పుడు నోరు పారేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో తొమ్మిది సంవత్సరాల పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నామని తెలిపారు.
నాలుగునెలల్లోనే కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే తమ కండ్ల ముందు కదలాడుతున్నాయని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా కాసాని గెలుపు కోసం కృషి చేస్తున్నారని అన్నారు. బీసీలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాసాని జ్ఞానేశ్వర్ను పార్టమెంటుకు పంపిస్తే బీసీ గొంతుగా బీసీల సమస్యలపై పోరాడుతాడని చెప్పారు. 400 కోట్లున్న వారికి 40 కోట్లున్న వారి మధ్యన జరుగుతున్న ఎన్నిక అన్నారు. సంపన్నులను మట్టి కరిపించి సామాన్యుడిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ సంరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ ముత్యాల కృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు బోయల్లి శేఖర్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు.. ఆయన భాష చూస్తుంటే ఇంకా పీసీసీ హోదాలోనే కొనసాగుతున్నట్లు అనిపిస్తున్నది. అధికారంకోసం అలవి కానీ హమీలు ఇచ్చి.. ఇప్పుడు నోరు పారేసుకోవడం ఏమిటి?