హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను మంగళ్హాట్ పోలీసులు నాంపల్లికోర్టులో మంగళవారం సాయంత్రం హాజరుపరిచారు. నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు రాజాసింగ్ను హాజరుపరిచారు. రాజాసింగ్కు కోర్టు తరలించిన నేపథ్యంలో నాంపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. రాజాసింగ్పై రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పరిధిలో మంగళ్హాట్, బహదూర్పురా, డబీర్పురా, బాలానగర్ పోలీసు స్టేషన్లలో నమోదు కాగా, సంగారెడ్డి, నిజామాబాద్లో కూడా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మంగళ్హాట్ పీఎస్లో 153 ఏ, 295 ఏ, 505(2), 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం భావించింది. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని రాజాసింగ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.