బండ్లగూడ,సెప్టెంబర్ 9: రాజేంద్రనగర్ నియోజక వర్గం అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారి కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మామహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి రాజేంద్రనగర్ నియోజక వర్గం అభివృద్ధికి అనేక నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. అన్ని బస్తీలకు రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టడంతో పాటు మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరు పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టినట్లు తెలిపారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో నిరు పేదల ఇండ్లల్లో పెళ్లిలు ఘనంగా జరుగుతున్నాయన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడంతో పాటు నిరు పేద ప్రజలకు ఇరవై లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఆదేశాలతో తాము కూడా రాజేంద్రనగర్లో అనేక అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల కష్టాలను తీర్చుతున్నామని అన్నారు.నియోజక వర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్,ఏఎంసీ చైర్మన్ దూడల వెంకటేశ్గౌడ్, కౌన్సిలర్లు అమృత సుధాకర్రెడ్డి, మేకల వెంకటేశ్ ముదిరాజ్, అయిల్కుమార్, కో ఆప్షన్ సభ్యులు రాజేంద్రప్రసాద్, కవిత ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు హన్మంతు,గడ్డం శ్రీనివాస్గౌడ్,కొనమొళ్ల శ్రీనివాస్,మురళి పాల్గొన్నారు.
బండ్లగూడ,సెప్టెంబర్ 9: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లిలో రాందేవ్ బాబా జన్మాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లను చేస్తున్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించే ఈ వేడుకలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శనివారం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాందేవ్బాబా జన్మాష్టమి వేడుకలను వైభవంగా జరుపుకోవాలన్నారు. ఈ వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు.