మణికొండ, అక్టోబర్ 28: పేదలకు అండా గులాబీ జెండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలో పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం మణికొండ ప్రాంతానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిషన్కాకతీయ, మిషన్ భగీరథ, సీసీ, లింకురోడ్లు, హరితహారం, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ లాంటి ఎన్నో ఆదర్శనీయమైన పథకాలతో పాటు అభివృద్ధిని సాధించామన్నారు.
తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులన్నీ ప్రజల కళ్లముందే కనిపిస్తున్నాయని, చేపట్టబోయే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనన్నారు. కాంగ్రెస్ లాంటి మోసపూరితమైన పార్టీ ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి అన్యాయాలు, అక్రమాలకు పెద్దపీట వేసిన చరిత్ర ఆ పార్టీకి ఉందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎంపీపీ మల్లేశ్, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, పార్టీ నాయకులు సీతారాం, బషీర్, సత్యనారాయణ, బాబూరావు, శ్రీకాంత్, సదానంద్, పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుస్తా..
అత్తాపూర్, అక్టోబర్ 28: అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు. అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాంబాగ్ దేవాలయాన్ని శనివారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్పుత్ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో రాజ్పుత్ సంఘం పూర్తి మద్దతు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కే ఉంటుందని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తనవంతు బాధ్యతగా కృషి చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపుత్ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
కొమురం భీమ్కు ఘన నివాళి
అత్తాపూర్, అక్టోబర్ 28: మహనీయుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ సూచించారు. అత్తాపూర్ ఆదివాసీ తోటి సేవా సంఘం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శనివారం కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ హాజరై కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన హక్కులను కాపాడేందుకు మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని తెలిపారు. వారి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంగీత, సంఘం అధ్యక్షుడు సోయం ప్రభాకర్, ఉపాధ్యక్షులు జి.జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి అతిరం గోవింద్, కోశాధికారి జి.నర్సింహ, కృష్ణ, సదానందం తదితరులు పాల్గొన్నారు.