Padma Rao Goud | సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : “ పజ్జన ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. ఎంపీ అయితే ఇంకా చేస్తారు.. అందుకే మా ఓటు పజ్జన్నకే. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడికే మా మద్ధతు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి చేసిందేమీలేదు.” అని సికింద్రాబాద్ ప్రజలు నినదిస్తున్నారు. సికింద్రాబాద్ లోక్సభ బరిలో నిల్చిన తీగుళ్ల పద్మారావు గౌడ్కు జనం నీరాజనాలు పలుకుతున్నారు.
50 ఏండ్లలో కనిపించని అభివృద్ధి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పజ్జన్న ఎమ్మెల్యేగా సాధ్యమైందని చెబుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, రూ.800 కోట్లతో వివిధ రంగాల నిర్మాణ పనులు చేపట్టి అక్కడి ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల ఆదరణతో పద్మారావు గౌడ్ మంత్రి, శాసన సభ డిప్యూటీ స్పీకర్గా పదవులు చేపట్టారు.
గడిచిన పదేండ్లలో అన్ని వర్గాల అభివృద్ధిపై పద్మారావు దృష్టి సారించారు. సీతాఫల్ మండి ప్రభుత్వ స్కూల్లో రూ.29.75 కోట్లతో జూనియర్, డిగ్రీ కాలేజీ మంజూరు చేయించారు. సికింద్రాబాద్ పరిధిలో 5 స్కూళ్లను ఎంపిక చేసి రూ.50 లక్షల చొప్పున నిధులను మంజూరు చేయించారు. నిరుద్యోగులకు స్కిల్స్ శిక్షణ ఇచ్చేందుకు సెట్విన్ కేంద్రాలను ఏర్పాటు చేసి 3,500మందికి ఉపాధి కల్పించారు.
తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను సీతాఫల్మండీ, అంబర్నగర్, అడ్డగుట్టలో నెలకొల్పారు. సీతాఫల్మండీ కుట్టి వెల్లోడి ఆసుపత్రి 75పడకల స్థాయికి పెంచి కొత్త భవనాల నిర్మాణానికి రూ.9.25 కోట్ల నిధులను మంజూరు చేయించారు. రవీంద్రనగర్, చింతబావి, దుడ్బావి, ఇందిరానగర్, అంబర్నగర్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. 15,444మందికి ఆసరా పెన్షన్లు అందించారు.
449 పొదుపు సంఘాలకు రూ.40 కోట్ల రుణాలు, సీఎం సహాయనిధి కింద సుమారు 3,100మందికి రూ.29కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 4,526 మందికి రూ.45.26 కోట్లు, దళిత బంధు స్కీంలో 100మందికి రూ.10 లక్షల చొప్పున, బీసీ కార్పొరేషన్ ద్వారా సుమారు 200 మందికి రూ.50 వేల చొప్పున రుణాలను అందించారు. మహాత్మాజ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధిలో భాగంగా రూ.20లక్షల చొప్పున ఏడుగురికి అందించారు.
రూ.14 కోట్లతో రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణానికి నిధులను మంజూరు చేయించి 846 పనులను చేపట్టారు. రూ.100 కోట్లకుపైగా నిధులతో రిజర్వాయర్ల పునర్నిర్మాణం చేపట్టారు. సీతాఫల్మండీలో మల్టీపర్పస్ ఫంక్షన్హాల్, బోయ బస్తీ, మధురనగర్ కాలనీలో ఫంక్షన్ హాల్లను నిర్మించారు. అడ్డగుట్ట, లాలాపేటలో కొత్తగా మరో రెండు ఫంక్షన్ హాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. తుకారం గేటు వద్ద రూ.73 కోట్లతో ఆర్యూబీ నిర్మించారు. మెట్టుగూడలో రూ.30 కోట్లతో, మాణికేశ్వర్నగర్లో రూ.20 కోట్లతో రెండు ఆర్యూబీల నిర్మాణానికి ప్రభు త్వం నుంచి అనుమతి ఇప్పించారు. రూ. 6.10 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని ప్రారంభించారు.