చిక్కడపల్లి/కవాడిగూడ, జూలై 27 : భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ గాంధీనగర్ డివిజన్ అరుంధతీనగర్ బస్తీలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఉస్సేన్సాగర్ నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పరీవాహక బస్తీ ప్రజలకు వరద ముప్పు తప్పిందన్నారు. అరుంధతీనగర్ బస్తీలో మోరీ కారణంగా బస్తీలోకి వరదనీరు చేరిందని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నూతన పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు రాకేశ్కుమార్, ఇరిగేషన్ శాఖ ఈఈ శంకర్, ఏఈ శ్యామ్సుందర్, జీహెచ్ఎంసీ డీఈ గీత, ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేశ్, నాయకులు ముఠా నరేశ్, శ్రీనివాస్గుప్తా, రాజ్కుమార్, జీ. శ్రీనివాస్, శ్రీకాంత్, హనుమంతు, కృష్ణ, జీవై గిరి, సరస్వతి, చందు, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన కుటుంబాలకు ఆదుకుంటాం : ఎమ్మెల్యే
వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురువారం కవాడిగూడ డివిజన్లోని బండమైసమ్మ నగర్లోని ఓ ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, తాసీల్దార మల్లేశ్ కుమార్ సందర్శించి చిన్నారులను పరామర్శించారు. ఇల్లు కూలిపోయిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సాయం అందించడానికి కృషి చేస్తానని వారు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకుడు, ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, ప్రభాకర్, సంతోష్, బీజేపీ నాయకులు జి. వెంకటేశ్, మహేందర్బాబు, ఆర్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు కూలడంతో రోడ్డున పడిన చిన్నారులు
బండమైసమ్మనగర్కు చెందిన దానయ్య ఇంట్లో ఆయన కుమారుడు బాలరాజు తన భార్యాపిల్లలతో ఉంటున్నాడు. అయితే రోడ్డుప్రమాదాల్లో వేర్వేరు సమయాల్లో తండ్రీకొడుకులు ఇద్దరు మృతిచెందారు. బాలరాజు భార్య కూడా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి వారి కుమారుడు భాను, కుమార్తెలు నాగవాణి, భవాని ఆ రేకుల ఇంట్లోనే నివాసముంటూ చదువుకుంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గురువారం రాత్రి ఒక్కసారిగా ఇల్లు కూలిపోతుండ టాన్ని చూసి ఉలిక్కిపడిన ముగ్గురు బయటకు పరుగులు తీశారు. దాంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాత్రి పక్క ఇంట్లో తలదాచుకున్నామని ఆ విద్యార్థులు తెలిపారు. కాగా తల్లీతండ్రీ లేకపోవడంతోపాటు ఉన్న ఇల్లు కూడా కూలిపోవడంతో వారు వీధిన పడ్డారు. ప్రభుత్వం సాయం అందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
పద్మశాలి కాలనీలో విరిగిపడిన భారీ వృక్షం
భోలక్పూర్ డివిజన్ పద్మశాలి కాలనీలో గురువారం రాత్రి ఉదయం భారీ వృక్షం వేర్లతో సహా విరిగి విద్యుత్ తీగలపై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలు తెగి రోడ్లపై వేలాడుతుండటంతో ఆందోళన చెందిన స్థానికులు జీహెచ్ఎంసీ, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది విద్యుత్ తీగలను తొలగించారు.