ఎర్రగడ్డ, ఏప్రిల్ 11: మైనార్టీలు అన్ని రంగాల్లో ఎదగటానికి వీలుగా పలు సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం యూసుఫ్గూడ డివిజన్లో రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ విద్యారంగంలో వెనుకబడ్డ మైనార్టీలకు ఉర్దూ మీడియం గురుకుల పాఠశాలలను నెలకొల్పారని అన్నారు.
ఏటా రంజాన్ను పురస్కరించుకుని ముస్లింలకు ప్రభుత్వం ద్వారా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం ఒక్క తెలంగాణకే సొంతమన్నారు. మతాలకతీతంగా అన్ని పండుగలను అందరూ కలిసి జరుపుకోవటం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ప్రత్కేకత అని అన్నారు. సోదర భావంతో ఉంటున్న ప్రజల మధ్య మత ఘర్షణలు ప్రేరేపించటానికి కొన్ని శక్తులు ప్రయత్నించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను మైనార్టీ నేతలు ఘ నంగా సన్మానించారు. హాజరైన ముస్లింలకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్దాస్, మన్సూర్ పాల్గొన్నారు.