బంజారాహిల్స్, సెప్టెంబర్ 17 : తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతనే ఇక్కడకు వచ్చి మాట్లాడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. రెండోవిడత డబుల్ బెడ్రూం లబ్ధిదారులుగా లక్కీ డ్రా ద్వారా ఎంపికైన 500మందితో ఆదివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పినప్పుడు ఎలా ఇస్తారంటూ సన్నాయి నొక్కులు నొక్కిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్పటేల్, దేదీప్యరావు, డివిజన్ల అధ్యక్షులు సంతోష్, అప్పుఖాన్, ప్రదీప్కుమార్, కృష్ణమోహన్, నాయకులు విజయ్కుమార్, అంబటి రామకృష్ణ, విజయసింహ, సిరాజ్, నజీర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.