వెంగళరావునగర్ : వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లకు అందిస్తున్న స్మార్ట్ ఫోన్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు సర్కారు దవాఖానాల పరిస్థితి ఘోరంగా ఉండేదని..కుళ్లిన కంపు వ్యర్థాలతో దుర్భరంగా ఉండేవని దవాఖానలు రోగాలకు నిలయంగా ఉండేదని..అలాంటి పరిస్థితిని సీఎం కేసీఆర్ పూర్తిగా మార్చివేశారని అన్నారు.
కేసీఆర్ సీఎం అయ్యాక అన్ని పరీక్షలు సర్కారీ దవాఖానాల్లో ఉచితంగా అందుబాటులోకి వచ్చాయని..పేద రోగులకు కావాల్సిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు. గర్భిణుల ఆరోగ్యం విషయంలో ఆశా వర్కర్లు ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారన్నారు.
విధి నిర్వహణలో అశావర్కర్లకు సౌకర్యంగా ఉండేందుకు స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి వెంకట్, ఎస్పీహెచ్ఓ అనురాధ, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.