కేపీహెచ్బీ కాలనీ, మార్చి 27 : మల్కాజిగిరి(Malkajigiri) పార్లమెంట్లో బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించడకం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram) అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.ఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులు, పేదలకు అందిన సంక్షేమ పథకాల కారణంగానే కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందన్నారు.
స్థానిక ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఆశీర్వదించారన్నారు. కొన్ని కారణాల వల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదని.. మూడు నెలల కాంగ్రెస్ పార్టీ పాలనను చూసి ప్రజలందరూ మరలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.