బాలానగర్, అక్టోబర్ 26 : ముచ్చటగా మూడోసారి మనదే విజయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయనతో పాటు డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ఓల్డ్బోయిన్పల్లిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిని కాంక్షించే వారందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విరోచిత పోరాటం చేసి ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ పలుమార్లు పదవులను తృణప్రాయంగా వదిలి వేసి రాజీనామాలు చేసి ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఏ ప్రాంతానికి వెల్లినా తాగునీటి కొరత వలన మహిళలు ఖాలీ కుండలతో గొడవలు పడేవారని, కరెంట్ కొరత కారణంగా పరిశ్రమలు కుంటుపడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం.. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడం వలన తెలంగాణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశ ప్రజలకు దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. అనంతరం కార్పొరేటర్ నర్సింహయాదవ్ మాట్లాడుతూ.. కూకట్పల్లి ఎమ్మెల్యేగా మాధవరం కృష్ణారావు వచ్చిన తర్వాతనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పడుతున్నాయని తెలిపారు.
ఈ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో మూలమూలన చేపట్టిన అభివృద్ధి పనులే ఆయన పనితీరుకు నిదర్శనం అన్నారు. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో వేలాది కోట్లు వెచ్చించి అభివృద్ధిని చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నరేందర్గౌడ్, సయ్యద్ ఎజాజ్, మక్కల నర్సింగ్, కర్రె లావణ్య, ఇర్ఫాన్, హరినాధ్లతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.