కేపీహెచ్బీ కాలనీ, జనవరి 20: కేపీహెచ్బీ కాలనీలో గుడి, బడి భూములను అమ్ముకునే పనులను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని, హౌసింగ్ బోర్డు లే అవుట్ ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన 10 శాతం స్థలాలను ప్రజలకు చూపించాలని, ప్రజల ఆస్తులను అమ్ముతే ఊరుకునేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. సోమవారం కేపీహెచ్బీ కాలనీలోని గోవర్ధనగిరి కొండపై హౌసింగ్బోర్డు అధికారులు సీజ్ చేసిన వేణుగోపాల స్వామి కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాసరావులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేపీహెచ్బీ కాలనీలో 30 ఏండ్ల క్రితం నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు అకస్మాత్తుగా సీజ్ చేయడం బాధాకరమన్నారు. ఆలయ కమిటీ సభ్యులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సమాచారం కూడా లేకుండా, పంచనామా నిర్వహించకుండా కల్యాణ మండపాన్ని సీజ్ చేశారని, దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లో ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించిన స్థలంలో బోర్డులు ఎందుకు పాతారో? అర్థం కావడం లేదన్నారు. కాలనీ 5వ ఫేజ్ సమీపంలో చర్చీ కోసం కేటాయించిన స్థలంలో కూడా హౌసింగ్ బోర్డు అధికారులు బోర్డులు పాతారన్నారు.
ప్రజల సొత్తును అమ్మితే ఊరుకోం…
కేపీహెచ్బీ కాలనీలో గుడి, బడి, చర్చీలు, ఇతర కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన ఖాళీ స్థలాలను అమ్ముకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేపీహెచ్బీ కాలనీలో హౌసింగ్ బోర్డు లే అవుట్ ప్రకారం, కమ్యూనిటీ అవసర కోసం వదలిన 10 శాతం ఖాళీ స్థలాలను ప్రజలకు చూపించాలని, తర్వాతే మిగిలిన స్థలాలను అమ్ముకోవాలన్నారు. కాలనీలో అమ్మకానికి పెట్టిన స్థలాలను జీవో నం.6 ప్రకారం పక్కన ఉన్న స్థల యాజమానులకు విక్రయించాల్సి ఉండగా, ప్రభుత్వం 3, 5, 10 గజాల స్థలాలను సైతం వదలకుండా వేలం పాట పెట్టడం సరికాదన్నారు. కాలనీలోని ఖాళీ స్థలాలను మార్కెట్ ధరలకు మించి గజం రూ.1.25 లక్షలు నిర్ణయించడం సరికాదని, పేద ప్రజలు కొనుగోలు చేసేలా ప్రభుత్వ ధర ప్రకారం, 26 వేలకే గజం చొప్పున విక్రయించాలన్నారు.
గతంలో కాలనీలో 1, 2, 3, 9వ ఫేజ్లలో స్థలాలను కోర్టులో పోరాడి సాధించుకుని, పార్కులుగా, క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేశామని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ప్రజా సమస్యలను పక్కన పెట్టి భూములను అమ్ముకునే పనులను చేపట్టిందని విమర్శించారు. ప్రజల ఆస్తులను అమ్మి, కోట్లాది రూపాయాలు దండుకునే దుర్మార్గపు ప్రయత్నాన్ని ప్రజలందరితో ఏకమై అడ్డుకుంటామని, ప్రభుత్వం ధోరణి మార్చుకోకపోతే…, ఈ నెల 24న జరిగే వేలం పాటను అడ్డుకుంటామని ఎమ్మెల్యే మాధవరం హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, కో ఆర్డినేటర్ సతీశ్ ఆరోరా, డివిజన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి, శ్యామల రాజు, రాజేశ్, పీఎల్ ప్రసాద్, సాయి, ఆయా కాలనీల బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.