బాలానగర్, జూలై 14 : కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం పక్కా ప్రణాళికతో కార్యచరణ చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ మల్లికార్జునకాలనీలోని డివిజన్ కార్పొరేటర్ ఇంటి సముదాయంలో విద్యుత్ సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆయనతో పాటు టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరక్టర్ శ్రీనివాస్రెడ్డి, మెట్రో సీజీఎం నరసింహస్వామి, ఎస్ఈలు రవికుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని 9 డివిజన్ల కార్పొరేటర్లు వారి వారి డివిజన్లలో నెలకొన్న సమస్యలను సమీక్షా సమావేశంలో తెలియపరిచారు.
విద్యుత్ రంగంలో కొత్త ఆవిష్కరణలు
అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృష్టి చేస్తుందన్నారు. ఈ నేపధ్యంలో రైతులు 3 పంటలు దండిగా పండిస్తున్నారని, పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుందన్నారు. ఇతర వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సవ్యంగా నడుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల నివారణ కోసం అవసరమైన చోట సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కోసం స్థలాలు కేటాయించనున్నట్లు తెలిపారు. కూకట్పల్లి డివిజన్లో సబ్స్టేషన్ ఏర్పాటుకు భూధాన్ భూములు కేటాయించనున్నట్లు, బాలానగర్ డివిజన్కు ఇండస్ట్రియల్ ఏరియాలో స్థలం కేటాయించనున్నట్లు, ఓల్డ్బోయిన్పల్లికి గ్రేవ్యార్డ్ భూమి, అల్లాపూర్ డివిజన్కు పద్మావతినగర్లో 2 ఎకరాల స్థలం కేటాయించనున్నట్లు ప్రకటించారు.
ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలి
విద్యుత్ సమస్యలు తెలియజేయడం కోసం వినియోగదారులు ఏ సమయంలో ఫోన్ చేసినా ఏఈలు కానీ, ఏడీఈలు కానీ, డీఈలు కానీ స్పందించి సరైన సమాదానం ఇవ్వాలని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. వినియోగదారులే ఫోన్ చేయాలని లేదు.. ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే ఫోన్ చేస్తే స్పందించాలి. ఎమ్మెల్యేనో.. కార్పొరేటరో సమస్యలు గుర్తించి చెప్పే వరకు ఏఈలు, ఈడీఈలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వినియోగదారుల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నందున సిబ్బంది ఎవరైనా కూడా బాధ్యతగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈలు, ఏడీఈలు, సీబీడీ ఏడీఈలు ఏఈలు, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, జలమండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.