కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 11 : కూకట్పల్లి నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందుతాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లిలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబూరావు, సబిహాబేగం, సతీశ్గౌడ్, నర్సింహయాదవ్, ఆవుల రవీందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రవణ్కుమార్, కో ఆర్డినేటర్ సతీశ్ అరోర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ గతంలో కూకట్పల్లిలో తాగునీటి కోసం ఆడబిడ్డలు ఇబ్బందులు పడేవారని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రిజర్వాయర్లను నిర్మించి తాగునీటి పైప్లైన్ వ్యవస్థను ఆధునీకరించామని, తద్వారా మహిళలకు సమృద్ధిగా తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థల పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. చెరువులను సుందరీకరించి వర్షంనీటి కాలువలను ఆధునీకరించామని, దీంతో ముంపు సమస్యలు తగ్గాయన్నారు. కేపీహెచ్బీ కాలనీ, కైత్లాపూర్, బాలానగర్లలో నిర్మించిన ైప్లెఓవర్లతో ట్రాఫిక్ కష్టాలన్నీ తీరాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దన్నారు. నియోజకవర్గంలో 16వేల మంది ఆడబిడ్డల పెండ్లికి ఆర్థికసాయం, 44వేల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు త్వరలోనే అందుతాయని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్పై నమ్మకముంచితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని తెలిపారు.
గృహలక్మి పథకానికి దరఖాస్తు చేసుకోండి..
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో అర్హులైన పేదలందరూ గృహలక్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు. నియోజకవర్గంలో 2500 మందికి గృహలక్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థికసాయం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గానికి 4400 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారని, మొదటి విడతగా 500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేసినట్లు చెప్పారు. విడతల వారీగా అర్హులందరికీ ఇండ్లు అందుతాయన్నారు.
రేవంత్ ఒక్కనాడైనా కూకట్పల్లికి వచ్చావా..?
కాంగ్రెస్, బీజేపీ నేతలు మాయమాటలు చెబుతున్నారని వాటిని ప్రజలకు గమనించాలని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి ఒక్కనాడైనా కూకట్పల్లి ప్రజల కష్టాలు పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూకట్పల్లి నివాసితులు కారని పక్క నియోజకవర్గాల్లో నివాసముండే వారికి ఇక్కడి ప్రజల కష్టాలను ఎలా పరిష్కరిస్తారని అన్నారు. కూకట్పల్లి గ్రామంలో పుట్టిపెరిగానని.. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి 400 ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయాన్ని, చిత్తారమ్మ దేవాలయాలను పునఃనిర్మించడం పూర్వజన్మ సుకృతమన్నారు. మసీదులను, చర్చిలను అభివృద్ధి చేస్తూ సర్వమతాలకు సమప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నమ్మకముంచి గెలిపించినందుకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే కూకట్పల్లిని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం.. కార్యకర్తలు, నాయకులు కృషి ఫలితంగా మరోసారి విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.