కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 28: కూకట్పల్లి నియోజకవర్గం ఓటర్లంతా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, బంగారు భవిష్యత్ కోసం బీఆర్ఎస్ను ఆదరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ, నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశానని, మరింత అభివృద్ధి కోసం మూడోసారి ఆశీర్వదించాలని కోరారు. పదేండ్లలో కూకట్పల్లి నియోజకవర్గంలో 9 భారీ రిజర్వాయర్లను నిర్మించి, 388 కి.మీ. పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, తద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నామని భవిష్యత్లో కరెంటు మాదిరిగా తాగునీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 24 గంటల కరెంటు సరఫరాతో జనరేటర్లు, ఇన్వర్టర్లు అవసరం లేకుండా పోయిందన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ చౌరస్తాలో, కైత్లాపూర్ నుంచి మాదాపూర్ వరకు, బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, కాలనీ 7వ ఫేజ్లో అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించామని భవిష్యత్లో మరో రెండు మూడు ఫ్లైఓవర్లను నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యలన్నీ తీరుతాయన్నారు.
మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే కూకట్పల్లికి ఒక్కరోజైనా రాలేదని, ఒక్క రూపాయి నిధులు కూడా తేలేదన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలందరికీ అండగా నిలిచి అత్యవసర వస్తువులను అందించింది తామేనని, కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కరిని కూడా ఆదుకోలేదన్నారు. ఎన్నికలప్పుడు కనిపించే నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతల హామీలకు దిక్కుండదని, విజ్ఞతతో ఆలోచించి బంగారు భవిష్యత్ కోసం బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలను అమలు చేశారన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందిస్తామని హామీనిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఆదరించాలని..నాన్ లోకల్ అభ్యర్థులకు ఓటేస్తే అందుబాటులో ఉండరన్నారు.