కేపీహెచ్బీ కాలనీ, మార్చి 4 : రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలను నివారించే దిశగా నాలాల(Nalas) అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madha varam) కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లతో కలిసి వినతిపత్రాన్ని అందించి.. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను వివరించి నిధులు కేటాయించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గంలో ముంపు సమస్యలను పరిష్కరించే దిశగా ఇప్పటికే నాలాల అభివృద్ధి పనులు చేపట్టామని.. వాటిని పూర్తి చేసేందుకు తగిన నిధులను కేటాయించాలన్నారు. అలాగే కాలనీలు, బస్తీలలోని నాలాలను అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలన్నారు. నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న శ్మశానవాటికలు, పార్కుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలని లేకుంటే ముంపు సమస్యలు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, కార్పొరేటర్లు ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్రెడ్డి, పండాల సతీశ్గౌడ్, సబీహాబేగం, పగుడాల శిరీషాబాబూరావు, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్, పగుడాల బాబూరావు తదితరులు ఉన్నారు.