మారేడ్పల్లి, డిసెంబర్ 13 : కంటోన్మెంట్( Cantonment)ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే జి. లాస్యనందిత(MLA Lasyananditha) అన్నారు. కంటోన్మెంట్ నాలుగోవ వార్డు లోని పికెట్ ఎరుకల బస్తీలో బుధవారం ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి వెంటనే స్పందించారు. కొత్త బోర్ వెల్కు మోటర్ను ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లాస్యనందితకు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే లాస్యనందిత మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులందరికి అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా పని చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పనస సంతోష్, రాంమోహన్, కిరణ్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.