కంటోన్మెంట్, జనవరి 12: ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కారుణ్య నిమామకాలు చేపట్టేందుకు ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 120 మంది దరఖాస్తులకు గానూ తొలుత 27 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మార్గం సుగుమమైంది. శుక్రవారం బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సీఈఓ మధుకర్ నాయక్, ఎమ్మెల్యే లాస్యనందిత, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, జాయింట్ సీఈఓ ఆకాశ్ కుమార్ శర్మ పాల్గొన్నారు. తొలుత కంటోన్మెంట్కు రక్షణ మంత్రిత్వ శాఖ అవార్డు రావడంపై అధ్యక్షుడు బోర్డు అధికారులు, స్థానిక ప్రజలకు అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్వెల్స్కు మీటర్లు పెట్టాలన్న ప్రతిపాదనకు రామకృష్ణ అభ్యంతరం తెలిపారు.
హస్మత్ పేటలోని 28 ఎకరాల ట్రెన్సింగ్ గ్రౌండ్ స్థలాన్ని కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులకు కేటాయించాలని సీఈఓ మధుకర్ నాయక్ ప్రతిపాదించగా, నామినేటెడ్ బోర్డు సభ్యుడు వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో.. బోర్డు ఉద్యోగులు కూడా ఓ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం స్థలాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకుల మహేందర్ బోర్డు సమావేశం అనంతరం రామకృష్ణతో వాగ్వాదానికి దిగారు.
అక్రమ నిర్మాణాలకు జారీ చేసే( 248/ 320) నోటీసులపై సమావేశం వాడివేడిగా చర్చ జరిగింది. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని 248 నోటీసు జారీ చేసినా..నిర్మాణదారులు స్పందించని యెడల నెల రోజుల గడువు తర్వాత 320 నోటీసు జారీ చేసేందుకు బోర్డులో ప్రతిపాదన రాగా, నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ అడ్డుకున్నారు. 320 నోటీసు బోర్డు ఆమోదం లేకుండా ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణదారుల నుంచి ట్యాక్స్లు వసూలు చేయడంతోపాటు జరిమానాలు విధించాలని సీఈఓ ప్రతిపాదించగా, రామకృష్ణ వ్యతిరేకించారు. దీంతో ఆ అంశాన్ని పెండింగ్లో ఉంచారు.
కంటోన్మెంట్ బోర్డులో కీలక విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు అధికారులు మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో మరో ముగ్గురు అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి బోర్డు ఆమోదం తెలిపింది. సమావేశంలో శానిటేషన్, నీటి విభాగం సూపరింటెండెంట్లు ఎం. దేవేందర్, రాజ్కుమార్ పాల్గొన్నారు.