కేపీహెచ్బీ కాలనీ, మార్చి 28 : కాముని చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ పనులను(STP construction) వేగ వంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. గురువారం బాలాజీనగర్ డివిజన్లోని రెయింబో విస్తాస్ రాక్ గార్డెన్ పక్కన నిర్మిస్తున్న ఎస్టీపీ పనులను ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో చెరువుల పరిరక్షణ, సుందరీకరణలో భాగంగా చెరువులలోకి మురుగునీరు చేరకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ పనులు పూర్తయితే చెరువుల్లోకి స్వచ్ఛమైన నీరు చేరుతుందని.. తద్వారా చెరువు ఆహ్లాదకరంగా మారుతాయన్నారు.
చెరువులలో దుర్గంధం మాయమవుతుందని, పరిసర ప్రాంతాల్లో దోమల బెడద తప్పుతుందన్నారు. చేపట్టిన పనుల విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు, స్థానిక నేతలు అధికారులున్నారు.