అంబర్పేట, ఏప్రిల్ 19: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తనకు ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన అంబర్పేటకు ఏం చేశారో చెప్పనేలేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేటకు ఒక్క పని కూడా చేయలేదని, తానే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒప్పుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గోల్నాక డివిజన్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం శివంరోడ్డులోని ధ్రువ ఎలైట్లో డివిజన్ అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ ..కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి తన శాఖలో 4వేల పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నా.. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. అంబర్పేటలో చదువుకున్న యువత ఎంతో మంది ఉన్నారని, వారికి ఉద్యోగాలు ఇప్పించి ఉంటే జీవితాంతం గుర్తు పెట్టుకునేవారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 12వేల కోట్లతో సబర్మతి నదిని అందంగా తీర్చిదిద్దారని, మరీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి మూసీని ఎందుకు అభివృద్ధి చేయలేదని, నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి బస్తీల్లో వాటర్ సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించి.. దాన్ని పెద్దగా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.