అంబర్పేట, ఆగస్టు 11: నల్లకుంట డివిజన్ నర్సింహబస్తీని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రూ.73 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ నర్సింహబస్తీలోని అన్ని గల్లీల్లో ఇప్పటికే మంచినీరు, డ్రైనేజీ పైపులైన్ పనులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పనులు చేపట్టడంతో రోడ్లన్నీ గుంతలుగా మారాయని, వాటి స్థానంలో నూతన రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మహేందర్ గల్లీలో కొత్త డ్రైనేజీ పైప్లైన్ వేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బస్తీవాసులతో అక్కడే రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మహేందర్ గల్లీలో కొత్త డ్రైనేజీ పైప్లైన్ను ఏర్పాటు చేయాలని వాటర్వర్క్స్ అధికారులకు చెప్పారు. అలాగే మోడ్రన్ వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తానన్నారు. బస్తీవాసుల కోరిక మేరకు బస్తీలో ఎమ్మెల్యే బడ్జెట్ నుంచి సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గృహలక్ష్మి పథకం కింద అర్హులైన వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇవ్వాలన్నారు. దళితబంధు కింద మంచి ప్రాజెక్టును ఆలోచించుకొని ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి మొదటి ప్రాధాన్యత లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ ప్రవీణ్, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, సీనియర్ నాయకులు భూపతినాథ్, ఎన్. భాస్కర్గౌడ్, కూర నరేందర్, జి.ప్రదీప్రావు, రఘురాంరెడ్డి, నాగేందర్, వీరయ్యగౌడ్, రాజేశ్వర్రావు,క్రిస్టోఫర్, చంద్రప్రభ, రేణుక, సత్యనారాయణ, ప్రదీప్, మూర్తి, గాలపల్లి శంకర్, నవీన్, రాజు, సతీష్చంద్ర, చంద్రకాంత్, భిక్షపతి, భాస్కర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.