అంబర్పేట/ కాచిగూడ/ గోల్నాక, డిసెంబర్ 28: అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ,అంబర్పేట, గోల్నాక, నల్లకుంట, బాగ్అంబర్పేట డివిజన్లలో ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ షురూ.. అయ్యింది. గురువారం మొదటి రోజే దరఖాస్తుల స్వీకరణలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని సెంటర్లో సమయానికి అధికారులు రాకపోవడంతో ప్రజలు నిరీక్షించారు. ఒక్కొ క్క డివిజన్లో నాలుగు టేబుల్స్ వేసి దరఖాస్తులు స్వీకరించారు. అభయహస్తం కింద మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, చేయూత పథకాలకు దరఖాస్తును స్వీకరించారు. అయితే మొదట ఇంటింటికీ వచ్చి దరఖాస్తులు ఇస్తారని అధికారులు ప్రకటించారు. కాని ప్రజలు ఒక్కసారిగా ప్రజాపాలన కేంద్రాలకు తరలిరావడంతో వారి దగ్గర ఉన్న కొద్దిపాటి దరఖాస్తు ఫాంలు అయిపోయాయి. నింబోలిఅడ్డా కార్యాలయంలో దరఖాస్తులు అయిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలేరు సొంత డబ్బులతో దరఖాస్తు ఫాంలను జిరాక్స్ చేయించి ప్రజలకు పంపిణీచేశారు.
మొదట తాము ఇచ్చిన దరఖాస్తులు మాత్రమే తీసుకుంటామని చెప్పిన అధికారులు తర్వాత జిరాక్స్ కాఫీలను కూడా తీసుకున్నారు. చాలా మంది ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. తమకు దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళితే ఇక్కడకాదని అధికారులు వందలాది మందిని వెనక్కి పంపించారు. దీంతో కాం గ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేశారు.
గోల్నాకలో.. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అంబర్ పేట డివిజన్ న్యూపటేల్నగర్ కమ్యూనిటీ హాల్, ఎంసీహెచ్ కమ్యూనిటీ హాల్, రఘునాథ్నగర్ కమ్యూనిటీ హాల్, ప్రేమ్నగర్ కమ్యూనిటీహాల్ , గోల్నాక డివిజన్ లంకబస్తీ కమ్యూనిటీహాల్, గంగానగర్ కమ్యూనిటీహాలలో దరఖాస్తులు ఇచ్చేందుకు బారులు తీరారు. కార్పొరేటర్ దూసరి లావణ్యగౌడ్ గంగానగర్ కమ్యూనిటీ హాల్లో దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.