ఎల్బీనగర్/మలక్పేట/చాదర్ఘాట్, మార్చి 27: మూసీ నదికి సుందర హంగులు అద్దుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నాగోలు బ్రిడ్జ్ ప్రాంతంలో మూసీనది పక్కన నిర్మించిన వాకింగ్ ట్రాక్పై మలక్పేట్ ఎమ్మెల్యే బలాల, మూసీ కార్పొరేషన్ ఎండి విశ్వజిత్తో కలిసి ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి శనివారం ఉద యం పర్యటించారు. వాకింగ్ ట్రాక్ పనులను ఎమ్మెల్యే బలాలకు చూపించారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ, నాగోలు బ్రిడ్జ్ నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర మూసీ పరీవాహకంలోని ప్రాంతాల వారికి సుందరమైన వాకింగ్ ట్రాక్ను అందుబాటులోకి తేవడంతో పాటుగా పరిసర కాలనీవాసులకు ఆహ్లాదకరమైన వాతవరణాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.
రాబోయే రోజుల్లో మూసీలో చెత్త వేయకుండా చేయడంతో పాటుగా చుట్టు పక్కల ఉన్న చెత్తను కూడా పూర్తిగా తొలగించి సుందరీకరిస్తామన్నారు. మూ సీనదిని అన్ని విధాలుగా సుందరీకరించి భవిష్యత్తులో మూసీ లో బోటు షికారు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆరు ప్రాంతాల్లో అత్యాధునిక వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మూసీ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.