సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నియోజకవర్గంలో 22 లక్షల 17 వేల 94 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఇందులో 11,25,310 మంది పురుషులు, 10,91,587 మంది స్త్రీలు, కాగా, 107 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 57 మంది నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రుటినీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 19 మందిని రిజెక్ట్ చేసినట్టు వివరించారు. 8 మంది నానినేషన్ను ఉపసంహరించుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్ పరిధిలో 1944 పోలింగ్ కేంద్రాలు, 807 పోలింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 85 ఏండ్లు పైబడిన ఓటర్ల కోసం హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. హోమ్ ఓటింగ్ మే 3, 4వ తేదీలలో నిర్వహిస్తామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ అవుతున్నట్టు చెప్పారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కోసం 203 సెక్టోరల్ ఆఫీసర్స్ను నియమించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రజిత, తాసిల్దార్ జాహురుద్దీన్ పాల్గొన్నారు.