సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పది ఫలితాల్లో హైదరాబాద్కు నిరాశనే ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల్లో 30వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో మొత్తం 86.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలే ముందంజలో ఉన్నారు. బాలికలు 89.90 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 83.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హైదరాబాద్లో 73,202 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 63,511 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 91.01 శాతం ఉత్తీర్ణతను సాధించగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 89.61శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.